హర్యానాలో మతమార్పిడి నిరోధక బిల్లు ఆమోదం 

కాంగ్రెస్ నిరసనలు తెలిపినప్పటికీ, అసెంబ్లీ నుండి వాకౌట్ చేసినప్పటికీ హర్యానా ప్రభుత్వం మంగళవారం చట్టవిరుద్ధమైన మత మార్పిడి నిరోధక బిల్లు- 2022ను ఆమోదించింది. బలవంతం, మితిమీరిన ప్రభావం లేదా ఆక్షర్షణ ద్వారా మతమార్పిడులను నిరోధించే బిల్లును మార్చి 4న ప్రవేశపెట్టారు. 

ఈ బిల్లు ప్రకారం రుజువు బాధ్యత నిందితుడిపై ఉంటుంది. ప్రలోభపెట్టి, బలవంతంగా, మోసపూరితంగా మత మార్పిడి చేస్తే ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయలు తగ్గకుండా జరిమానా విధించే నిబంధన ఉంది. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో ఇలాంటి బిల్లులు ఇప్పటికే ఆమోదం పొందాయి.

మైనర్‌ను, స్త్రీని లేదా ఎస్సీ,ఎస్టీ తెగలకు చెందిన వ్యక్తిని మతం మార్చినా, మార్చడానికి ప్రయత్నించినా నాలుగు సంవత్సరాల కంటే తక్కువ కాలం జైలు శిక్ష విధించబడుతుందని బిల్లు పేర్కొంది. దీనిని 10 సంవత్సరాల వరకు కూడా పొడగించవచ్చు. అంతేకాక రూ. 3 లక్షల కంటే తక్కువ కాకుండా జరిమానా విధించొచ్చు. 

కాగా పలువురు కాంగ్రెస్ ఎంఎల్‌ఏలు ఈ బిల్లును ‘రాజ్యాంగ విరుద్ధం’ అని విమర్శించారు. సమాజాన్ని మత ప్రాతిపదికన చీల్చే ప్రయత్నమని ధ్వజమెత్తారు. విధానసభ స్పీకర్ గ్యాన్ చంద్ గుప్తా ‘నివారణ చర్యలుగా కొన్ని చర్యలు కూడా తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. 

ఇదిలావుండగా హర్యానా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు భూపిందర్ సింగ్ హుడా మాట్లాడుతూ ‘ఇప్పటికే ఉన్న చట్టాలలో బలవంతంగా మతమార్పిడులకు శిక్షపడే నిబంధన ఉంది, తాజా చట్టం తీసుకురావాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కిరణ్ చౌదరి బిల్లును ఆమోదించడం గురించి మాట్లాడుతూ ‘హర్యానా చరిత్రలో ఒక చీకటి అధ్యాయం’ అని మండిపడ్డారు. 

అయితే ఈ బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం అసెంబ్లీలో ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ మాట్లాడుతూ తాము ఏ వర్గాన్ని చిన్నచూపు చూసే దృష్టిలో ఈ బిల్లు తీసుకురాలేదని స్పష్టం చేశారు. అయితే ప్రజల వ్యక్తిగత విశ్వాసాలకు వ్యతిరేకంగా జరుగుతున్న బలవంతపు చర్యలను ఆపేందుకు ఈ చట్టం చేశామని తెలిపారు. పెళ్లి ద్వారా ఒక మతం నుంచి మరొక మతానికి చాలా మంది బలవంతంగా తమ విశ్వాసాలను మార్చుకుంటున్నారని, దాన్ని అడ్డుకోవాలని ఖట్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.