అస్సాంలో ముస్లింలను మైనారిటీలుగా పరిగణింపలేం !

అస్సాం జనాభాలో 35 శాతం ముస్లింలు ఉన్నారని చెబుతూ ఈశాన్య రాష్ట్రంలో ఇకపై వారిని మైనారిటీలుగా పరిగణించలేరని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్పష్టం చేశారు. 1990లో కాశ్మీరీ హిందువుల వలసలను గురించి కూడా ప్రస్తావించారు. అంతేగాదు బాలీవుడ్ చిత్రం ‘ది కశ్మీర్‌ ఫైల్స్’లో చూపిన విధంగా అస్సాం మారుతుందేమో అని ఇతర వర్గాల్లో రేకెత్తుతున్న భయాలను తొలగించడం రాష్ట్రంలోని ముస్లింల కర్తవ్యం అని ఆయన చెప్పారు.
అస్సాం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా శర్మ మాట్లాడుతూ, “ఈ రోజు ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు, సమాన అవకాశాలు, అధికారాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి దానిని నిర్ధారించడం వారి కర్తవ్యం” అని హితవు చెప్పారు. 

గిరిజనుల హక్కులు పరిరక్షించబడతాయని వారి భూములు ఆక్రమించబడవని శర్మ అని భరోసా ఇచ్చారు. ఆరో షెడ్యూల్ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల భూములను ఆక్రమించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బోరా, కలిత (అస్సామీ ఇంటిపేర్లు) ఈ భూమిలో స్థిరపడకపోతే  ఇస్లాం, రెహమాన్ (ముస్లిం ఇంటిపేర్లు) కూడా ఆ భూముల్లో స్థిరపడవని తేల్చి చెప్పారు. 

అస్సాం జనాభాలో ముస్లింలు 35 శాతం ఉన్నందున ఇక్కడ మైనారిటీలను రక్షించడం వారి కర్తవ్యం” అని ముఖ్యమంత్రి సూచించారు. అస్సామీ ప్రజలు భయాందోళనలో ఉన్నారని చెబుతూ  సంస్కృతి, నాగరికత రక్షింపబడతుందో లేదో అనే భయంతో ఉన్నారని తెలిపారు . సామరస్యం అంటే టూ-వే ట్రాఫిక్ అని చెప్పారు.

ముస్లింలు శంకరి సంస్కృతి, సత్త్రియ సంస్కృతి రక్షణ గురించి మాట్లాడనివ్వండి.. అప్పుడే సామరస్యం ఉంటుందని శర్మ స్పష్టం చేశారు.   పదేళ్ల క్రితం ముస్లీంలు మైనారిటీలు కాదు కానీ ఇప్పుడు మైనారిటీలుగా ఉన్నారని తెలిపారు. “ఇతర వర్గాల్లో మెదులుతున్న  భయాల్ని ముస్లీంలు పోగొట్టాలి. ఇక్కడ మరో కశ్మీర్‌ పునరావృతం కాదని మాకు భరోసా ఇవ్వాలి’ అని డిమాండ్‌ చేశారు.