పార్టీ నేతల పిల్లలకు సీట్లు రాకపోవడానికి నేనే కారణం!

వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదమని, అలాంటి రాజకీయాలకు భారతీయ జనతా పార్టీలో ఎప్పటికీ స్థానం ఉండబోదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ నేతల పిల్లలకు టికెట్లు ఇవ్వకపోవడానికి కారణం తానేనని ప్రధాని ఈ సందర్భంగా చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం ఢిల్లీ లోని అంబేద్కర్ కేంద్రంలో జరిగింది. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బిజెపి అఖండ విజయం సాధించడంతో ప్రధాని మోడీ, బిజెపి జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డాను పార్టీ నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా మోదీ  మాట్లాడుతూ వారసత్వ రాజకీయాలపై నేతలకు కీలక సూచనలు చేశారు. 

కుటుంబ పార్టీలు దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని, వారసత్వ రాజకీయాలతో ప్రజాస్వామ్యానికి ముప్పు కలుగుతోందని అలాంటి వాటికి వ్యతిరేకంగా బిజెపి పోరాడుతోందని తెలిపారు.  అలాంటప్పుడు పార్టీ కూడా అందుకు ఉదాహరణగా నిలబడాలని సూచించారు.

దేశంలో వారసత్వ రాజకీయాలపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రజల మనోభావాలను గౌరవిస్తూ పార్టీ ఎంపీల కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు మోదీ చెప్పారని  కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి మీడియాకు తెలిపారు.  ఈ నిర్ణయాన్ని పార్టీ నేతలంతా స్వాగతించారని చెప్పారు. 

వారసత్వ రాజకీయాలపై పోరులో భాగంగా ముందు బీజేపీలో ఆ సంప్రదాయానికి చెక్‌ పెట్టాలన్నారని తెలిపాయి. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలను మరింత చైతన్యవంతులను చేయాలని పిలుపునిచ్చారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

“ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా మంది పార్టీ పార్లమెంటు సభ్యులు, నేతలు తమ పిల్లలకు టికెట్లు అడిగారు. అయితే ఇందులో చాలామంది అభ్యర్థులను పార్టీ తిరస్కరించింది. ఇందుకు పూర్తి బాధ్యత నాదే. నా వల్లే మీ పిల్లలకు పార్టీ టికెట్లు ఇవ్వలేదు” అని తెలిపారు. యూపీలో బీజేపీ ఎంపీ రీటా బహుగుణ జోషి కుమారుడు మయాంక్‌కు పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో ఆయన ఎస్పీలో చేరారు.

వారసత్వ రాజకీయాలు కులతత్వానికి దారితీస్తాయని చెబుతూ  దీనిపై ఎంపీలందరూ పోరాడాలని పిలుపిచ్చారు.  కుటుంబ పార్టీల నైజాన్ని బయటపెట్టాలని మోదీ  పార్టీ నేతలకు పిలుపునిచ్చినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల్లో విజయానికి కృషి చేసిన నేతలు, ఎంపిలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించే అంశాన్ని కూడా కొందరు నేతలు రాజకీయం చేశారని మోదీ పేర్కొన్నారు. ఎంపీలు, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా భారతీయులను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండగా.. కొందరు రాజకీయ నేతలు అసంబద్ధ ప్రకటనలతో రాజకీయాలు చేయాలని చూశారని ఆరోపించారు. అలాంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. 

ది కశ్మీర్ ఫైల్స్‌పై మోదీ  ప్రశంసలు

ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం ది కశ్మీర్ ఫైల్స్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఇది చాలా మంచి సినిమా, మీరందరూ తప్పకుండా చూడాలి. ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలి. అని ప్రధాని చెప్పారు. 1990ల్లో కశ్మీరీ పండితులపై జరిగిన దారుణాలను, నాటి అకృత్యాలను కళ్లకు కట్టేలా చిత్రీకరించిన ‘ద కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమాను ప్రధాని మోదీ ప్రశంసించారు.

ఇలాంటి సినిమాల వల్ల ప్రజలకు వాస్తవాన్నాలు తెలుస్తాయని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో జరిగిన దారుణాలు, ఘోరాలను ప్రజలకు తెలియనివ్వలేదని.. ఏళ్ల తరబడి అణచివేయబడిన వాస్తవాలు ఈ సినిమా ద్వారా వెలుగులోకి వచ్చాయని మోదీ చెప్పారు. సినిమాలో చూపిన అంశాలపై సమస్యలు ఉన్నా వారు వాస్తవిక దృక్పథంతో ఆలోచించాలని, నిజాలను తెలుసుకోవాలని సూచించారు. 

దేశ ప్రజలకు నిజాలు తెలియాలంటే గాంధీ, కశ్మీర్‌ ఫైల్స్‌ వంటి సినిమాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని ప్రధాని చెప్పారు. దేశ విభజన, 1975లో ఎమర్జెన్సీ వంటి అనేక అంశాలు ఉన్నాయని.. వాటి గురించి పూర్తి వివరాలతో ఇప్పటి వరకు సినిమాలు రాలేదని చెప్పారు. అయితే ఈ సినిమాకు కుట్రలు జరుగుతున్నాయని, నిజాలు చెబుతున్న చిత్రాన్ని తప్పుగా చూపించేందుకు కొందరు ప్రచారం చేస్తున్నారని మోదీ  ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.