పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణం

పంజాబ్ ముఖ్యమంత్రిగా  భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. భగత్ సింగ్ గ్రామం ఖట్కర్ కలాన్ లో ఆయన  ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ప్రమాణం చేయించారు.  ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పాల్గొన్నారు.
 
 ప్రమాణ స్వీకారానికి వచ్చే పురుషులు పసుపు రంగు తలపాగా ధరించారు.. మహిళలు పసుపురంగు దుప్పటి ధరించి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన భగవంత్ మాన్.. ప్రజలకు పారదర్శక పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగుల నుంచి  రైతుల వరకు అన్నిసమస్యలు పరిష్కరిస్తానని పేర్కొన్నారు. 
 
ఈ ఎన్నికల్లో పెద్ద పెద్ద నాయకులు ఓడిపోయారని, ప్రజలు గెలిచారని చెబుతూ మంచి పాలన ఎలా అందించాలో ఆమ్ ఆద్మీకి  తెలుసని స్పష్టం చేశారు. పంజాబ్‌ అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలతో ముందుకుసాగుతామని చెప్పారు. అవినీతి రహిత పాలనను అందిస్తామని, యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తామని భగవంత్ మాన్ భరోసా ఇచ్చారు.
తాను ఈ రోజు ఎవ్వరినీ విడదీయడానికి లేనని,తమ పార్టీకి ఓటు వేయని వారందరికీ కూడా తాను ముఖ్యమంత్రినేనని అన్నారు. ప్రసంగం చివరిలో ‘ ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ అంటూ భగత్‌ సింగ్‌ నినాదాన్ని నినదించారు.. 1970 తర్వాత రాష్ట్రంలో అత్యంత యుక్త వయస్సు గల ముఖ్యమంత్రిగా భగవంత్‌మాన్‌ నిలవనున్నారు.
ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్‌మాన్‌ను ప్రకటించగా,  కాంగ్రెస్‌పై కేజ్రీవాల్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో తాను భగత్‌సింగ్‌ స్వగ్రామానికి వెళుతున్నట్లు సోషల్‌ మీడియాలో అంతకముందు భగవంత్‌ మాన్‌ తెలిపారు.
 
117 అసెంబ్ల స్థానాలున్న పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ 92 స్థానాల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. సంగ్రూర్ జిల్లాలోని ధురి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన  భగవంత్ మాన్కాం గ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డీపై 58, 206 ఓట్ల తేడాతో గెలుపొందారు. పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్, అకాలీదళ్ కాకుండా మరో పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం.