హైదరాబాద్‌కు అంతర్జాతీయ కీర్తి

హైదరాబాద్ ఆర్బిట్రేషన్ సెంటర్ కేంద్రం ఏర్పాటుతో హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయిలో ఖ్యాతి లభిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ తెలిపారు. హైటెక్స్‌లోని ఐకియా వెనుక ఉన్న 3.7 ఎకరాల్లో ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ శాశ్వత భవన నిర్మాణానికి జస్టిస్ ఎన్‌వి రమణ శనివారం నాడు శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా సిజెఐ మాట్లాడుతూ ఈ కేంద్రం భవన నిర్మాణానికి గచ్చిబౌలిలో విలువైన భూమి కేటాయించిన సిఎం కెసిఆర్‌కు జస్టిస్ ఎన్‌వి రమణ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం కొనసాగుతున్నదని చెప్పారు. సింగపూర్ మాదిరిగా హైదరాబాద్ కేంద్రం కూడా ప్రపంచ ఖ్యాతి పొందాలని ఆకాంక్షించారు.

వచ్చే ఏడాది ఈ సమయానికి భవనం పూర్తి కావాలని ఆశించారు. ఐఎఎసి ప్రతిపాదనను సిఎం కెసిఆర్‌కు చెప్పిన వెంటనే అంగీకరించడంతో పాటు అనతికాలంలో దానికోసం ఓ తాత్కాలిక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయని నాతోపాటు సిఎం కెసిఆర్ సైతం నమ్ముతారని చెప్పారు.

ఈ భవన నిర్మాణానికి భూమిపూజ చేయడం ఎంతో సంతోషంగా ఉందని, దీనికోసం రూ.50 కోట్లు కేటాయించారని ఆయన వెల్లడించారు. అనంతరం ఆర్బిట్రేషన్ మీడియేషన్ భవన నిర్మాణానికి సహకరించిన సిజెఐ ఎన్‌వి రమణ, సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌లకు సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ హిమ కోహ్లీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, ఐఎఎంసి ట్రస్టీలైన స్రుపీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర్రావు, సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, మంత్రులు కెటిఆర్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సిఎస్ సోమేశ్‌కుమార్, సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.