తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పేరు గొప్ప.. ఊరు దిబ్బలా ఉందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ధ్వజమెత్తారు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే విద్య, వైద్య రంగానికి చాలా తక్కువ శాతం కేటాయించారని, రెవెన్యూ ఖర్చులకు కూడా అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని ఆమె విమర్శించారు.
గతంలో కేటాయించిన బడ్జెట్ ఎంత? వాస్తవంగా ఖర్చు చేసింది ఎంతో బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కేటాయించారని పేర్కొంటూ సభ నుంచి బీజేపీ ఎమ్యెల్యేలను సస్పెండ్ చేయడం సరైంది కాదని ఆమె మండిపడ్డారు. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో బడ్జెట్ అంటే కేసీఆర్ సర్కార్ విలువ లేకుండా చేసిందని అంటూ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అనుమానాస్పదంగా ఉందని, అన్నీ గాలి లెక్కలు చూపించారని విజయశాంతి విమర్శించారు. విద్యా వ్యవస్థలో మౌలిక వసతులకు తప్ప, టీచర్ల భర్తీ గురించి చెప్పలేదని ఆమె తెలిపారు. అలాగే కార్పొరేషన్లకు నిధులు లేవని అంటూ ప్రతి అంకెకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమె స్పష్టం చేశారు.
ఉపాధికి సంబంధించిన ప్రస్తావన బడ్జెట్లో లేదని అంటూ ముందుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతి తీసుకోవాలని ఆమె హితవు చెప్పారు. ఎంతో కొంత బడ్జెట్ కేటాయించి చేతులు దులుపుకోవడం సరైంది కాదని ఆమె స్పష్టం చేశారు. రైతుబంధు, భీమా లాంటి పథకాలకు తప్ప, వ్యవసాయరంగంలో మిగతా వాటికి కేటాయింపులు లేవని విమర్శించారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులమయంగా చేశారని విజయశాంతి మండిపడ్డారు. తెలంగాణను తెగనమ్మితేగాని ఆదాయం రాని పరిస్థితి నెలకొందని ఆమె ధ్వజమెత్తారు. భూములు, జాగాలు అమ్మాలి. లిక్కర్ తాగించాలి… లేదంటే అప్పులు తేవాల్సిన పరిస్థితి ఉందని ఆమె ఎద్దేవా చేశారు. ఏడేండ్లలో ఏడు రెట్లు అప్పులు చేసి రుణభారాన్ని రూ.5 లక్షల కోట్లకు చేర్చారని ఆమె గుర్తు చేశారు.
ఏడాదికి రూ.30 వేల కోట్లు అప్పుల మిత్తీలకే సరిపోతే… ఇక రాష్ట్రాన్ని ఎలా నడుపుతారు? అని ఆమె ప్రశ్నించారు. బంగారు తెలంగాణ చేసిన… అని చెప్పుకొంటున్న దొరగారు, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎవరికోసం చేశారు? పంట నష్టపోయిన రైతును ఆదుకున్నరా? తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకున్నరా? కార్పొరేషన్స్ లోన్స్ ఇచ్చారా? అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. కమీషన్లతో ఫామ్ హౌస్లు నింపుకోవడానికి రాష్ట్రాన్ని ఆగం చేశారని ధ్వజమెత్తారు.
More Stories
రజాకార్ల గుప్పిట్లో నుండి హైదరాబాద్ విముక్తికై బిజెపికి ఓటు
తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు
దిశ ఎన్కౌంటర్ కేసులో హైకోర్టులో పోలీసులకు ఊరట