ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకుల్లో అగ్రగామిగా రవీంద్ర జడేజా

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. రెండు స్థానాలు మెరుగుపరచుకుని 406 పాయింట్లతో మొదటి స్థానానికి చేరుకున్నాడు. ఇక వెస్టిండీస్‌ ఆటగాడు జేసన్‌ హోల్డర్‌ ఒక స్థానం దిగజారి 382 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. 
ఇక టీమిండియా మరో ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సైతం ఒక స్థానం కోల్పోయి 347 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌, ఇంగ్లండ్‌ ప్లేయర్‌ బెన్‌ స్టోక్స్‌, ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్‌ స్టార్క్‌, కివీస్‌ ప్లేయర్లు కైలీ జెమీషన్‌, కొలిన్‌ డీ గ్రాండ్‌హోం, ఆసీస్‌ టెస్టు, ఇంగ్లండ్‌ ప్లేయర్‌ క్రిస్‌ వోక్స్‌ వరుసగా టాప్‌ 10లో చోటు దక్కించుకున్నారు.
ఇటీవల శ్రీలంకతో స్వదేశంలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో జడేజా అద్భుత ప్రదర్శన కనబరచారు. 175 పరుగులతో అజేయంగా నిలవడమే గాక, మ్యాచ్‌లో మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇక అశ్విన్‌ విషయానికొస్తే 61 పరుగులు సాధించి, 6 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ సారథ్యంలోని టీమిండియా ఇన్నింగ్స్‌ మీద 222 పరుగుల తేడాతో విజయం సాధించింది.