మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో కిడ్నాప్ కలకలం

మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి ఇంట్లో కిడ్నాప్ కలకలం రేపుతోంది. న్యూఢిల్లీ వీఐపీ ఏరియాలోని సౌత్ ఎవెన్యూ ప్లాట్ నెంబర్ 105 లోని జితేందర్ రెడ్డి నివాసం వద్ద  కారు డ్రైవర్‎తోపాటు ముగ్గురు అతిథులను దుండగులు  అపహరించారు. 
 
మహబూబ్ నగర్ కు చెందిన ఉద్యమకారుడు మున్నూరు రవి, తన ఇద్దరు స్నేహితులతో కలిసి వ్యక్తిగత పనుల మీద కొన్ని రోజుల క్రితం ఢిల్లీకి వచ్చాడు. వీరంతా  జితేందర్ రెడ్డి ఇంట్లో ఉంటున్నారు. కాగా.. నిన్న సాయంత్రం రవితో పాటు అతని స్నేహితులను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. 
 
వీరందరినీ కారులో ఎక్కించుకుని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ పుటేజీలో నమోదయ్యాయి. వీరిని దుండగులు ఎందుకు అపహరించారనే విషయంపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఇప్పటివరకు కిడ్నాప్ అయిన వారి ఆచూకీ కూడా ఇంకా తెలియలేదు.
 
 ఈ మేరకు ఢిల్లీ సౌత్ ఎవెన్యూ పీఎస్‎లో జితేందర్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది ఫిర్యాదు చేశారు. కిడ్నాప్‎కు సంబంధించిన విషయాన్ని జితేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
 
2018 అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ అఫిడవిట్‌ దాఖలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారంలో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి శ్రీనివాసగౌడ్ పై  మున్నూరు రవి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై కమీషన్ విచారణ చేస్తున్నది.