ఏప్రిల్‌ 14 నుంచి సంజయ్ మలిదశ పాదయాత్ర

రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్‌ 14 నుంచి రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ప్రారంభిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ప్రకటించారు. గత ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ నేతలు ఈసీకి సమర్పించిన అఫిడవిట్లలో పేర్కొన్న ఆస్తులను, ఎమ్మెల్యేలు, మంత్రులయ్యాక సంపాదించిన ఆస్తులను బేరీజు వేసి వాటి ఆధారంగా విచారణ జరిగేదాకా ప్రజాక్షేత్రంలో పోరాడతామని స్పష్టం చేశారు. 
 
సోమవారం హైదరాబాద్‌ బీజేపీ జోనల్‌ సమావేశంలో సంజయ్‌ మాట్లాడుతూ.. ‘ఈసీకి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సమర్పించిన తప్పుడు అఫిడవిట్‌పై ఫిర్యాదు చేసిన వారిని సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో పోలీసులు కిడ్నాప్‌ చేయడం అత్యంత దారుణం. దీనిపై ఈసీ విచారణ ముగిసే వరకు ఆరుగురు ఫిర్యాదుదారులను జైళ్లో పెట్టడమే లక్ష్యంగా కేసులు నమోదు చేశారు’ అని మండిపడ్డారు. 
 
బీజేపీ ఇలాంటి దా రుణాలను అడ్డుకుని తీరుతుందని స్పష్టం చేశారు. మంత్రి రాజీనామా చేసే వరకు పార్టీ పరంగా ఆందోళనలను కొనసాగిస్తామని సంజయ్ ప్రకటించారు.  బీజేపీ అధికారంలోకి రానుందని తెలియడంతో సీఎం కేసీఆర్‌ బోగస్‌ సర్వే ఫలితాలను సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ ప్రజలు అక్కడా.. ఇక్కడా.. బీజేపీ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావాలని కోరుకుంటున్నరని తెలిపారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా ఉద్యమిస్తామని ప్రకటించారు. నిజమైన ఉద్యమకారులతోపాటు  మేధావులంతా బీజేపీలోకి రావాలని పిలుపునిచ్చారు.
 ‘ఇటీవల జనగామ సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ ఉనికి లేదన్నారు. అదే జనగామలో మార్చి నెలాఖరులో బహిరంగ సభ నిర్వహించి సత్తా చూపిస్తాం. మార్చి 6 నుంచి లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సదస్సులు నిర్వహించనున్నాం. 6న తొలి సదస్సు హైదరాబాద్‌లో నిర్వహిస్తాం’ అని చెప్పారు.

గత ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతోంది. హైదరాబాద్‌లో బీజేపీ ఓటు బ్యాంక్‌ 60 శాతానికి పెరిగిందని భరోసా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతైందని, గత ఎన్నికల ఫలితాలతోపాటు వివిధ సర్వేల్లో వెల్లడైన అంశాలే నిదర్శనమని స్పష్టం చేశారు. 

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జీ తరుణ్‌ఛుగ్, పార్టీ జాతీయ సంస్థాగత సంయుక్త కార్యదర్శి శివప్రకాశ్‌జీ, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సీనియర్‌ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి కూడా పాల్గొన్నారు.