దీంతో రాష్ట్ర హైకోర్టులో ఏడేళ్లుగా అగ్రిగోల్డ్ అక్షయగోల్డ్ వివాదాలు కొనసాగుతుండగా, వాటిని ఏలూరు కోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది. రాష్ట్ర హైకోర్టులోనే విచారణ కొనసాగించాలన్న డిపాజిటర్ల, బ్యాంకుల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అదే సమయంలో వేలం ద్వారా వచ్చిన రూ. 50 కోట్లను కూడా ఏలూరు కోర్టుకే బదిలీ చేసింది.
ఈ మేరకు హైకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలని ఏలూరు కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ డిపాజిటర్ల రక్షణ చట్టం ప్రకారం ఏలూరు కోర్టుకే విచారణాధికారం ఉందని ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశాలలో పేర్కొంది. అదేవిధంగా వీటికి సంబంధించిన 42 వ్యాజ్యాలపై విచారణ ముగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆకర్షణీయ పథకాలతో దాదాపు 32 లక్షల మంది డిపాజిట్దారులను మభ్యపెట్టి దాదాపు రూ.6,380 కోట్లను సేకరించినట్లు ఇడి దర్యాప్తులో వెలుగుచూసింది. దేశవ్యాప్తంగా ఈ సంస్థ ఏడు రాష్ట్రాల్లో డిపాజిట్లు సేకరించినట్లు ఇడి గుర్తించింది. స్థిరాస్తి వ్యాపారం పేరిట ఏజెంట్లను చేర్చుకున్న సంస్థ వారి ద్వారా పెద్దఎత్తున డిపాజిట్లను సేకరించింది.
డిపాజిటర్ల పేరిట కేటాయించినట్లు చెప్పిన ప్లాట్లకు హద్దులు నిర్ణయించకుండా, లొకేషన్ చెప్పకుండా, వాస్తవ మార్కెట్ విలువ ప్రస్తావించకుండా, సర్వే నంబర్లు వెల్లడించకుండా మాయ చేసింది.పేరుకే స్థిరాస్తి వ్యాపారమని చెప్పినా ఆర్బిఐ నుంచి అనుమతులు లేకుండానే డిపాజిట్లు సేకరించింది.
ఈ నిర్వాకాన్ని గుర్తించిన సెబీ వెంటనే వ్యాపార కార్యకలాపాల్ని అపేసి డిపాజిట్దారులకు సొమ్ము తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. దాన్ని పట్టించుకోని ఛైర్మన్ అవ్వ వెంకట రామారావు కొత్త కంపెనీలను తెరపైకి తెచ్చి కమీషన్ ఏజెంట్ల ద్వారా భారీగా డిపాజిట్లు సేకరించారు.
ప్రక్రియ కాస్తా పొంజి స్కామ్గా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో ప్లాట్లు ఇస్తామంటూ 32లక్షల మంది నుంచి తీసుకున్న సొమ్ముకు చివరకు దాదాపు 5.3లక్షల ప్లాట్లు మాత్రమే వెంచర్లలో ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.
More Stories
మంత్రికి వత్తాసు పలికారని కడప పోలీసులకు చార్జ్ మెమోలు
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన మీనా
ఏపీలో పెట్రోల్ బంక్లపై ఆంక్షలు