భద్రతా మండలిలో ఉక్రెయిన్ పై అమెరికా తీర్మానం

ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న రష్యాను ఎదుర్కొనేందుకు అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చాప్టర్‌ 7 తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ఈ తీర్మానంపై ఈస్టర్న్‌ టైమ్‌ ప్రకారం 15.00 గంటలకు ఓటింగ్‌ జరుగుతుంది. అయితే శాశ్వత సభ్య దేశమైన రష్యా ఈ తీర్మానానికి వ్యతిరేకంగా వీటో చేసే అవకాశం ఉండవచ్చు. ప్రస్తుతం రష్యా భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో ఉంది.

చాప్టర్‌ 7 తీర్మానం ఆమోదం పొందితే, రష్యా దాడిని తిప్పికొట్టేందుకు సైనిక సామర్థ్యాన్ని వినియోగించేందుకు అవకాశం కలుగుతుంది. చాప్టర్‌ 6 తీర్మానం అయితే శాంతియుత పరిష్కారానికి కృషి చేయడానికి వీలు కల్పిస్తుంది. భద్రతా మండలిలో రష్యా సహా 15 దేశాలకు సభ్యత్వం ఉంది. 

దీంతో చాప్టర్‌ 7 తీర్మానానికి అనుకూలంగా రష్యా మినహా మిగిలిన దేశాలన్నీ ఓటు వేసే విధంగా బ్రిటన్‌, ఫ్రాన్స్‌ మద్దతుతో అమెరికా తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే ఈ ఓటింగ్‌కు చైనా గైర్హాజరయ్యే అవకాశం ఉంది. భారత్‌ ఈ అంశంపై తటస్థంగా ఉంది. భారత దేశం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రష్యాను ఏకాకిని చేయడం కోసం ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని భారత్, చైనాలను అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ గట్టిగా కోరుతున్నారు. 

ఈ తీర్మానంపై రష్యా వీటో చేసే అవకాశం ఉండటంతో, దీనిని సాధారణ సభలో ప్రవేశపెట్టి, ఆమోదం పొందాలని అమెరికా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ సభలో వీటో అధికారం ఏ దేశానికీ లేదన్న సంగతి తెలిసిందే. ఈ ముసాయిదా తీర్మానం ఉక్రెయిన్‌పై రష్యా దాడిని  ఖండించింది. రష్యాను తిప్పికొట్టేందుకు బలగాలను ప్రయోగించేందుకు అధికారం కల్పించాలని కోరింది. 

ఉక్రెయిన్‌ నుంచి తక్షణమే వెనుకకు వెళ్ళాలని రష్యాను డిమాండ్‌ చేసింది. సైన్యాలను ఉక్రెయిన్‌ నుంచి బేషరతుగా ఉపసంహరించుకోవాలని కోరింది. ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్య్రం, సార్వభౌమాధికారాలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. అంతర్జాతీయ శాంతిభద్రతల ఉల్లంఘిస్తూ రష్యా దురాక్రమణకు పాల్పడిందని ఆరోపించింది.