విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, చోక్సీల నుంచి రూ.18,000 కోట్లు

బ్యాంకులకు పెద్ద మొత్తంలో రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల నుంచి రూ.18,000 కోట్లు తిరిగి బ్యాంకులకు రప్పించామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు బుధవారం తెలిపారు.   జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ సారథ్యంలోని ధర్మాసనానికి ఆ వివరాలు సమర్పించారు. 
 
మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కి ఇచ్చిన విస్తృత అధికారాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల పై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టుకి ఈ వివరాలు అందించారు. ధర్మాసనంలో ఇతర సభ్యులుగా జస్టిస్ దినేష్ మహేశ్వరి, సీటీ రవికుమార్ ఉన్నారు.
అంతేకాదు విదేశాల్లోని పరిస్థితులతో పోలిస్తే భారతదేశంలో పీఎంఎల్‌ఏ కింద చాలా తక్కువ సంఖ్యలో కేసులను దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో కేంద్రం సుప్రీం కోర్టులో యూకేని ఉదహరించింది.  ఇక్కడ మనీలాండరింగ్ చట్టం కింద ఒక ఏడాదిలో 7,900 కేసులు నమోదయ్యాయని, యూఎస్‌ (1,532), చైనా (4,691), ఆస్ట్రియా (1,036), హాంకాంగ్ (1,823), బెల్జియం (1,862),  రష్యా (2,764) నమోదవుతున్నాయని వివరించింది.
మనీ లాండరింగ్ చట్టం కింద రూ.67,000 కోట్లు విలువ చేసే క్రిమినల్ ప్రొసీడింగ్స్ అత్యున్నత న్యాయస్థానం ముందు ఉన్నాయని తుషార్ మెహతా చెప్పారు. గత ఐదేళ్లలో (2016-17 నుంచి 2020-21) పీఎంఎల్ఏ కింద 2,086 కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేపట్టామని, 22 లక్షల ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని చెప్పారు.
 
కాగా, పీఎంఎల్ఏ నిబంధనలు దుర్వినియోగం అవుతున్నాయని కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి, ముకుల్ రోహత్గి, సిద్ధార్ధ్ లుథర, అమిత్ దేశాయ్ సహా పలువులు న్యాయవాదులు ఇటీవల కాలంలో అత్యున్నత న్యాయస్థానం ముందు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 
 
వివిధ కోణాల నుంచి ఈ చట్టం విమర్శలకు గురవుతోంది. కఠినమైన బెయిల్ కండిషన్లు, ఏ కారణాలతో అరెస్టు చేశారనేది కమ్యూనికేట్ చేయకపోవడం, ఈసీఐఆర్ (ఎఫ్ఐఆర్) అందజేయకుండానే అరెస్టు చేయడం వంటివి ఇందులో కొన్ని.