మరో 25 ఏళ్ల భవిష్యత్తుకు బీజేపీ బాటలు వేసింది

“గత ఐదేళ్లలో మణిపూర్ సర్వతోముఖాభివృద్ధికి బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం పనిచేసింది. బీజేపీ సుపరిపాలనను, సత్సంకల్పాన్ని మీరు చూశారు. మరో 25 ఏళ్ల భవిష్యత్తుకు బీజేపీ బాటలు వేసింది” అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.మణిపూర్‌లోని హైన్‌గాంగ్ నియోజకవర్గంలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ, రాష్ట్రంలో బీజేపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని భరోసా వ్యక్తం చేశారు. 
 
మణిపూర్ రాష్ట్రాభివృద్ధికి బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం తప్పనిసరని స్పష్టం చేశారు.  కాంగ్రెస్ దశాబ్దాల పాలనలో అసమానత్వాన్నే రాష్ట్రం చవిచూసిందని ప్రధాని విమర్శించారు. మణిపూర్ రాష్ట్రం ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిందని, దశాబ్దాల కాంగ్రెస్ ఏలుబడిలో అసమానతలే చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ అసాధ్యాలను సుసాధ్యం చేసిందని చెబుతూ మణిపూర్‌లోని ఏ ప్రాంతంలోనూ ఇప్పుడు బంద్‌లు, దిగ్బాంధాలు లేవని గుర్తు చేశారు.
ప్రభుత్వంలో చురుకైన భాగస్వామ్యం కోసం, ప్రభుత్వ నిర్ణయాలలో పాలుపంచుకునేందుకు యువత, ఫస్ట్ టైమ్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి ఎన్.‌బీరేన్ సింగ్ అందరినీ కలుపుకొని వెళ్తూ రాష్ట్రాన్ని మార్పు దిశగా పరుగులు తీయిస్తున్నారని ప్రధాని ప్రశంసించారు. కరోనా సమయంలోనూ మణిపూర్‌లో ప్రతి ఒక్కరికీ ఉచిత వ్యాక్సిన్ అందించామని ఆయన చెప్పారు. 2017 కంటే ముందే ఇలాంటి మహమ్మారి వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదని ప్రధాని ప్రశ్నించారు.
 మణిపూర్‌లోని ప్రతి పది మందిలో ఏడుగురు ఉచిత రేషన్ లబ్ధి పొందుతున్నారని ప్రధాని చెప్పారు. మణిపూర్ మహిళలు విదేశీ శక్తులపై చారిత్రక పోరాటం సాగించారని మోదీ ప్రశంసించారు. ఎన్డీయే ప్రభుత్వాలు మాత్రమే మహిళల సమస్యలను అర్ధం చేసుకుని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచేందుకు పనిచేయగలవని స్పష్టం చేశారు.
కాగా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తదుపరి దశ ఓటింగ్ మార్చి 5న జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.