సిక్కు ప్రముఖులకు ప్రధాని ఆతిథ్యం

ప్రధాని నరేంద్ర మోదీ  శుక్రవారం తన గృహంలో సిక్కు ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సిక్కు సముదాయానికి తన ప్రభుత్వం చేసిన మంచి పనులను గురించి హైలైట్ చేసి చెప్పారు. పంజాబ్ ఎన్నికలకు రెండు రోజుల ముందు ఈ సమావేశం జరగడం గమనార్హం. 
 
ఈ సందర్భంగా బిజెపి నాయకుడు మన్‌జిందర్ సింగ్ సిర్సా  మాట్లాడుతూ ప్రధాని సిక్కు సముదాయం కోసం ప్రతి రోజూ పనిచేయాలనుకుంటున్నారని తెలిపారు. పాకిస్థాన్‌లోని ‘కర్తార్‌పూర్ సాహిబ్’ పవిత్ర క్షేత్రాన్ని 1965, 1971 యుద్ధాల తర్వాత భారత్ పొంది ఉండాల్సిందని ప్రధాని మోదీ  చెప్పారని విలేకరుల సమావేశంలో సిర్సా తెలిపారు. 
 
మోదీ  ఆతిథ్యంకు హాజరైన సిక్కు ప్రముఖులలో ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కాల్కా, పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా బల్బీర్ సింగ్ సిచెవాల్, యమునానగర్‌లోని సేవాపంతికి చెందిన మహంత్ కరమ్‌జీత్ సింగ్, కర్నాల్‌లోని డేరా బాబా జంగ్ సింగ్‌కు చెందిన బాబా జోగా సింగ్, డేరా బాబా ముఖీ సంత్ బాబా మేజర్ సింగ్ వా, అమృత్‌సర్‌లోని తారా సింగ్ వా ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. 
 
సమావేశానంతరం సిక్కు ప్రముఖులు ప్రధాని తమ సముదాయం కోసం చేసిన పనులను ప్రశంసించారు. కరమ్‌జీత్ సింగ్ అయితే మోదీని ‘సిఖీ’ అని కీర్తించారు. కాగా 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లలో పాలుపంచుకున్న వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని పేర్కొన్న కాల్కా, ప్రధాని మోదీని ఈ సందర్భంగా ప్రశంసించారు.