కశ్మీరు ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు, ఒక ఉగ్రవాది మృతి

భద్రతా దళాలకు, ఉగ్రవాదికి మధ్య జరిగిన కాల్పుల పోరులో ఇద్దరు సైనిక జవాన్లు, ఒక లష్కరే తాయిబా ఉగ్రవాది మరణించారు. షోపియాన్ జిల్లాలోని జయిన్‌పొరాలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
జెయిన్‌పొరాలోని చెర్మార్గ్‌లో ఉగ్రవాదులకు తలదాచుకున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో పోలీసులు, భద్రతా దళాలు కలసి సంయుక్తంగా శుక్రవారం రాత్రి అక్కడ గాలింపు చర్యలు చేపట్టాయని కశ్మీరు రేంజ్ ఐజి విజయ్ కుమర్ తెలిపారు. 
 
గౌహర్ అహ్మద్ భట్ అనే వ్యక్తి ఇంటిని తనిఖీ చేసేందుకు అతడిని ప్రశ్నిస్తుండగా ఇంట్లో నుంచి ఒక ఉగ్రవాది కాల్పులు జరపడంతో ఇద్దరు సైనిక జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు చేపట్టడంతో లోపల ఉన్న లష్కరే తాయిబా ఉగ్రవాది మరణించాడు.
 
 అతడిని పుల్వామాలోని లారూ కక్పోరాకు చెందిన అబ్దుల్ ఖయ్యూమ్‌గా పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి ఒక ఎకె రైఫిల్, పిస్టల్‌తోసహా వివిధ ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు జవాన్లు సిపాయ్ సంతోష్ యాదవ్, చవాన్ రోమిత్ తానాజీ 1 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందినవారని ఐజి తెలిపారు.