వివేకానంద రెడ్డి హత్యకు రూ 40 కోట్ల సుపారీ

వివేకానంద రెడ్డి హత్యకు రూ 40 కోట్ల సుపారీ

మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి  వైఎస్‌ వివేకా హత్య కేసుకు సంబంధించి సిబిఐ ఛార్జిషీట్‌ వెలుగులోకి వచ్చింది. గత ఏడాది అక్టోబర్‌ 26న వేసిన ఛార్జిషీట్‌తో పాటు ఐదవ నిందితునిగా దేవిరెడ్డి శంకర్‌రెడ్డికి సంబంధించిన వివరాలను పొందు పరుస్తూ 2022 జనవరి 31న పులివెందుల కోర్టులో సిబిఐ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. 

ఛార్జిషీట్‌లో ఎర్రగంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి, శంకర్‌రెడ్డి పేర్లను చేర్చినట్లు తెలుస్తోంది. వివేకా హత్య జరిగిన రోజు ఘటనకు సంబంధించిన వివరాలు, ఆధారాలు లేకుండా చేయడంలో ప్రముఖుల పాత్రపై ఛార్జిషీ ట్‌లో ప్రస్తావించినట్లు సమాచారం. 

‘బెంగళూరులో రూ.8 కోట్ల స్థలం సెటిల్‌మెంట్‌ విషయంలో వైఎస్‌ వివేకా, ఎర్రగంగిరెడ్డికి మధ్య గొడవలు మొదలయ్యాయి. వివేకాను హత్యచేయడానికి ఎర్రగంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, దస్తగిరి.. కలిసి 2019 ఫిబ్రవరి 10న ఎర్రగంగి రెడ్డి ఇంట్లో ప్రణాళిక రచించారు. వివేకాను హత్య చేస్తే శివశంకర్‌ రెడ్డి రూ.40 కోట్లు సుపారీ ఇస్తారని ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు.

తన వెనుక అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఉన్నారని ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లు వాంగ్మూలంలో దస్తగిరి వెల్లడించారు. వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు ప్రచారం చేయడంలో శంకర్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు.ఎర్రగంగిరెడ్డి, శివశంకర్‌ రెడ్డి సూచనల మేరకు బెడ్‌ రూం, బాత్‌ రూంలను పనివాళ్లు శుభ్రం చేశారు. వివేకాకు ఏడు చోట్ల బలమైన గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది’ అని ఛార్జిషీట్‌లో సిబిఐ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.