బజాజ్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ మృతి

ప్రముఖ పారిశ్రామిక వేత్త, బజాజ్ గ్రూమ్ మాజీ చైర్మన్, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత రాహుల్ బజాజ్ (83) శనివారం కన్నుమూశారు.కొన్నాళ్లుగా నిమోనియాతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బజాజ్ గ్రూప్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. 

నిమోనియాతో పాటు హృద్రోగ సమస్యలు ఉన్న రాహుల్ బజాజ్ గత నెలలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని పుణేలోని రూబీ హాల్ క్లినిక్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ పర్వేజ్ గ్రాంట్ తెలిపారు. రాహుల్ బజాజ్ 1938 జూన్ 10న కలకత్తా జన్మించారు. దాదాపు 40 ఏండ్ల పాటు బజాజ్ గ్రూప్ చైర్మన్ గా వ్యవహరించిన ఆయన, బజాజ్ కంపెనీ ప్రతి భారతీయుడు సొంతం చేసుకునేలా ‘హమారా బజాజ్’తో టూవీలర్ ను తీర్చిదిద్దారు.

ఆయన తాత జమ్నాలాల్ బజాజ్ స్థాపించిన ఈ కంపెనీని దేశంలో టాప్ వెహికల్ కంపెనీగా నిలిపడంలో రాహుల్ బజాజ్ పాత్ర ఎంతో కీలకం. గత ఏడాది ఏప్రిల్ లో ఆయన బజాజ్ కంపెనీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం గౌరవ చైర్మన్ హోదాలో ఉన్న ఆయనకు 2001 సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డును ప్రధానం చేసింది. ఆయన ఇద్దరు కుమారులు రాజీవ్, సంజీవ్ ఇప్పుడు సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

ఆయన   2006 నుంచి 2010 వరకు   రాజ్యసభ సభ్యునిగా కూడా పని చేశారు. ఇండియన్ మోటార్ వెహికల్ రంగంలో ప్రత్యేకమైన ముద్ర వేసిన హమారా బజాజ్ పై రూపొందించిన యాడ్ లో కార్పొరేట్ రంగంలో నిలిచిపోయే ట్యాగ్ లైన్ ను రూపొందించారు. ‘‘యువ్ జస్ట్ కాంట్ బీట్ ఏ బజాజ్ అండ్ హమారా బజాజ్’’ అన్న ట్యాగ్ లైన్ తో యాడ్ చేశారు.

కాగా, రాహుల్ మృతి పట్ల కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే పలువురు కాంగ్రెస్ నేతలు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు సంతాపం తెలిపారు.