ఏపీలో కాపులకు అభివృద్ధి ఫలాలు అందడం లేదు 

ఆంధ్రప్రదేశ్ జనాభాలో 18 శాతంగా ఉన్న కాపులకు అభివృద్ధి ఫలాలు అందడం లేదని రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జి వి ఎల్ నరసింహారావు ఆందోళన వ్యక్తం చేశారు.  జీరో అవర్ లో ఈ స‌మ‌స్య‌ని లేవనెత్తుతూ బ్రిటిష్ పాలనలో, కాపులను వెనుకబడిన తరగతులుగా పరిగణించారని, (1915 జిఓ నెం.67 ప్రకారం), అయితే  1956లో నీలం సంజీవ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ జాబితా నుండి వారిని తొలగించారని విమర్శించారు.
1956 నుంచి కాపులకు రాజకీయంగా అధికారం లేదన్న కారణంగా అన్ని ప్రభుత్వాలు, కాపులకు అన్యాయం చేశాయని ధ్వజమెత్తారు. విద్యాపరంగా, సామాజికంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న కాపులు రిజర్వేషన్ల కోసం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారని చెబుతూ   రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌లో కాపు రిజర్వేషన్ల కోసం తీవ్ర రాజకీయ ఆందోళనలు చేస్తూనే వున్నారని చెప్పారు. 
2017లో ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కాపులకు 5 శాతం  రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ కాపు రిజర్వేషన్ బిల్లు, 2017 పేరుతో ఏపీ రాష్ట్ర అసెంబ్లీ బిల్లును ఆమోదించిందని పేర్కొన్నారు.  అయితే,  రాష్ట్రంలో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నప్పటికీ, బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపారని విమర్శించారు.
“ఇది అనవసరం. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తనంతట తానుగా చర్య తీసుకోవచ్చు. ముస్లిం రిజర్వేషన్ బిల్లును సమ్మతి కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపలేదు, అయితే జాప్యం చేయడం కోసం కాపుల బిల్లును కేంద్రానికి పంపారు. ఆ బాధ్యతను కేంద్ర ప్రభుత్వంపై మోపాలన్నదే ఉద్దేశం” అని ఆయన గత టిడిపి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.
కాపు సామాజికవర్గానికి చెందిన ఇద్దరు రాష్ట్ర అధ్యక్షులను నియమించి కాపులపట్ల తనకున్న అభిమానం, నిబద్ధతను భారతీయ జనతా పార్టీ చాటుకొందని జివిఎల్ గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కాపులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలా చేయకపోతే రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని చూడవలసి వస్తుందని ఈ సందర్భంగా జి వి ఎల్ నరసింహారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.