మార్చ్ 1 నుంచి హెచ్-1బి వీసాల ప్రాథమిక రిజిస్ట్రేషన్లు

విదేశీయులు ఉద్యోగం చేసేందుకు జారీ చేసే హెచ్ 1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియను మార్చి 1న  ప్రారంభించనున్నట్లు అమెరికా  ప్రకటించింది. మార్చి 1 నుంచి మార్చి 18 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని యూఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ స్ఫష్టం చేసింది. 
 
2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వీసాల కోసం సంస్థలు, ప్రతినిధులు 10 డాలర్లు చెల్లించి ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ప్రకటించింది. మార్చి 18 వరకు వచ్చిన అప్లికేషన్లలో లాటరీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి మార్చి 31లోగా సమాచారం అందించనున్నారు. 
 
హెచ్ 1బీ వీసా పొందిన వారు ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమెరికాలో ఉద్యోగం చేసే వీలుంటుంది.  నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులు అమెరికాలో పనిచేసేందుకు అక్కడి ప్రభుత్వం ఏటా హెచ్ 1బీ వీసాలను జారీ చేస్తుంది. ఏటా 65వేల కొత్త వీసాలతో పాటు అమెరికాలో మాస్టర్స్ చేసే వారి కోసం మరో 20 వేల వీసాలు కేటాయిస్తుంది. 
 
2023 ఆర్థిక సంవత్సరం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి హెచ్-1బీ క్యాప్ కోసం ఓ ప్రత్యేక సంఖ్యను కేటాయించనున్నట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది. ఈ నంబర్ను ఉపయోగించి రిజిస్ట్రేషన్ను ట్రాక్ చేయొచ్చని పేర్కొంది. కరోనా మహమ్మారి వల్ల హెచ్-1బి వీసా దరఖాస్తుదారులకు నిర్వహించే వ్యక్తిగత ఇంటర్వ్యూను అమెరికా రద్దు చేసింది.
 
హెచ్ 1బీ వీసాలు పొందేవారిలో 70 శాతం మంది భారతీయులే ఉంటారు.  2021 ఆర్థిక సంవత్సరంలో హెచ్-1బి వీసాలను అందుకున్న వారిలో అమెజాన్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు.