రాంపల్లి మల్లిఖార్జునరావు,
సామజిక, రాజకీయ విశ్లేషకులు
మధ్య ఆసియా లోని ఐదు దేశాల అధినేతలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు కీలక మంత్రాంగం జరుపనున్నారు. వాస్తవానికి వారిని భారత రిపబ్లిక్ దినోత్సవాలకు ముఖ్యఅతిథులుగా ఆహ్వానించాలని నిర్ణయించారు. అయితే కరోనా మూడో వేవ్ కారణంగా ఆహ్వానించడం కుదరలేదు. దానితో వర్చ్యువల్ గా వారితో సమావేశం కానున్నారు.
పోటీ ప్రపంచంలో చిన్న దేశాలకు అండగా నిలబడటం, అండదండలు అందించటం దేశ దౌత్య సంబంధాల నీతిలో కీలకమైన అంశం. ఒక ప్రక్క ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా వైదొలగడం, రెండో ప్రక్క ఆసియాపై తన పట్టు బిగించడానికి చైనా బెల్ట్ అండ్ రోడ్డు ప్రాజెక్ట్ చేపట్టటం కారణాలతో మారుతున్న ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా మధ్య ఆసియా లోని దేశాలతో భారత్ పటిష్టమైన సంబంధాలు ఏర్పరుచుకోవడం ఒక చారిత్రక అవసరం ఏర్పడింది.
ఈ దేశాలు ఒకప్పుడు భారత్ లో అంతర్భాగం. ఆ దేశాలతో భారత్ కు సుదీర్ఘ చారిత్రక, సాంస్కృతికగ, ఆర్థిక, రాజకీయ సంబంధాలు ఉన్నాయి. ఆ దేశాలు మధ్య కాలంలో సోవియట్ యూనియన్ లో ఉండేవి. 1991 సంవత్సరం సోవియట్ రష్యా పతనం తర్వాత ఈ ఐదు దేశాలకు స్వతంత్రం వచ్చింది.
మధ్య ఆసియా ప్రాంతం రష్యా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియా, దూర ప్రాచ్య దేశాల కూడలిలో ఆ దేశాలు ఉన్నాయి , పామిర్ పర్వతాలు, అరల్ సముద్రం మధ్యలో ఉన్న ఈ ప్రాంతంలో శక్తి వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ఆదేశాల సమస్యలు భారతదేశంకు కూడా సమస్యలే. కాబట్టి పరస్పర అవగాహనతో సహకరించుకోవడం ఎంతో అవసరంఉన్నది.
ఆదేశాలు కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజకిస్తాన్. ఆ దేశాలతో భారతదేశానికి గడిచిన 30 సంవత్సరాలుగా మామూలు సంబంధాలున్నాయి. ఆ సందర్భంగా వార్షిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి 2015 జూలై లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ అయిదు గణ రాజ్యాలలో పర్యటన చేశారు.
2021 సెప్టెంబర్ 17న షాంగై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాలలో భారత ప్రధాని చేసిన ప్రసంగం లో మధ్య ఆసియా దేశాల మార్కెట్ మధ్య వారధిగా వ్యవహరించటానికి భారత్ కట్టుబడి ఉన్నదని చెప్పారు. 2021 సంవత్సరం నవంబర్ 10న ఐదు దేశాలతో పాటు రష్యా, ఇరాన్ జాతీయ భద్రతా సలహాదారులతో ఢిల్లీలో సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాలకు అజిత్ దోవల్ అధ్యక్షత వహించారు.
ఆఫ్గనిస్తాన్ లో చోటుచేసుకొంటున్న పరిణామాలపై ప్రధానంగా చర్చ జరిగింది. తీవ్రవాదం మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఎదుర్కోవడానికి ఉమ్మడి విధానంపై కూడా చర్చ జరిగింది. అట్లాగే 2021 డిసెంబర్ 19న విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఆ ఐదు దేశాల విదేశాంగ శాఖ మంత్రులకు ఆతిథ్యం ఇచ్చారు. ఆ సమావేశాలలో కలిసి పని చేయడానికి అంగీకరించారు.
కనెక్టివిటీ కార్యక్రమాలు పారదర్శకత, విస్తృత భాగస్వామ్యం, స్థానిక ప్రాధాన్యతలు, ఆర్థిక సుస్థిరత, అన్ని దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు గౌరవం వంటి సూత్రాలపై ఆధారపడి ఉండాలని వారు స్పష్టం చేసారు.
చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ పని విధానం ఆయా దేశాలను అప్పుల ఊబిలోకి లాగడం, బకాయిలు చెల్లించనందుకు బదులుగా ఆ ప్రాంతాలను మింగడం కోసం చైనా ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న కుట్రలుతో ఆ దేశాలు భయాందోళనలో ఉన్నాయి అనేది స్పష్టంగా వ్యక్తమైనది.
భద్రతకు సంబంధించినంతవరకు, భారతదేశం, మధ్య ఆసియా దేశాలు రెండూ శాంతియుత, స్థిరమైన, సంపన్నమైన పరిస్థితి కోసం ఆఫ్ఘనిస్తాన్ వ్యూహాత్మక దృక్కోణం చాలా ముఖ్యమైనదని గుర్తించాయి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి భౌగోళికంగా చాలా దగ్గరగా ఉంది. కానీ అది మూడు మధ్య ఆసియా దేశాలతో – తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్లతో తన సరిహద్దులను పంచుకుంటుంది.
ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రవాద కార్యకలాపాలు పెరిగితే, మధ్య ఆసియా రిపబ్లిక్లు కూడా దాని అధీనంలోకి రావచ్చు. ఈ కారణంగా, భారతదేశం, మధ్య ఆసియా దేశాల విదేశాంగ మంత్రుల సంయుక్త ప్రకటనలో ఆందోళన వ్యక్తమైనది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2593 (2021) ను వ్యూహాత్మక ప్రాముఖ్యత దృష్ట్యా ఒకే స్వరంతో వారు పునరుద్ఘాటించారు ఆ తీర్మానం ”ఆఫ్ఘనిస్తాన్ భూభాగం లో ఉగ్రవాదులకు ఆశ్రయం, శిక్షణ, కుట్ర వంటి ఉగ్రవాద కార్యకలాపాలకు ఆశ్రయం కల్పించకూడదు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులపై నియంత్రణ ఉండాలి. వారిని అణచివేయాలి” అంటూ పిలుపిచ్చింది.
భారతదేశం, మధ్య ఆసియా దేశాల మధ్య పరస్పర సమన్వయానికి ఇది ముఖ్యమైన అంశం. ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక సహకారాన్ని బలోపేతం చేయాలని, సానుకూల దృక్పథాన్ని అనుసరించాలని అంతర్జాతీయ సమాజానికి ఆ సమావేశం పిలుపునిచ్చింది. ఉగ్రవాద నిరోదానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిచేసే తీర్మానాలను పూర్తిగా అమలు చేయాలనే డిమాండ్ కూడా చేసారు.
ఇట్లా భారత్ తనప్రయత్నం చేస్తుంటే మరోప్రక్క పాకిస్తాన్ ఇస్లామాబాద్లో ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాలు నిర్వహించింది. మధ్య ఆసియా దేశాలు భారత్ తో సంబంధాల కోసం ప్రాధాన్యత ఇస్తున్నది. ఇది మంచి పరిణామము.
అమెరికాకు వ్యతిరేకంగా చైనా, రష్యాలు మధ్య ఆసియాలో పనిచేస్తుంటే భారతదేశం రష్యా, అమెరికాలతో సమతుల్యతకు ప్రత్యేక ప్రాముఖ్యత ను ఇస్తున్నది. అలాగే షాంఘై సహకార సంస్థలో సభ్య దేశంగా కూడా ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో భారత్ బాధ్యతాయుతమైన శక్తిగా తన పాత్రను నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంల ఐదు మధ్య ఆసియా దేశాధినేతలతో ప్రధాని జరుపుతున్న తాజా మంతనాలు వ్యూహాత్మక బంధం యొక్క బలమైన భవిష్యత్తుకు సంకేతం.
More Stories
విద్యా భారతి విజ్ఞాన కేంద్రంకు డా. భగవత్ తో ప్రారంభోత్సవం
బిజెపి అభ్యర్థి సుజనా చౌదరికి అమరావతి రైతుల మద్దతు
2 పేజీలతో వైసీపీ మేనిఫెస్టో విడుదల