సేవలు, సౌకర్యాలు సామాన్య ప్రజలకు నూటికి నూరుపాళ్లు అందాలి

P

ప్రజలు సౌఖ్యంగా జీవించేలా నూటికి నూరు పాళ్లు వారికి సంతృప్తికరంగా సేవలు , సౌకర్యాలు అందేలా సమయ పరిమితితో లక్షాలను రూపొందించుకుని పనిచేయాలని అదే యావత్ దేశ లక్షంగా భావించాలని జిల్లాల కలెక్టర్లకు ప్రధాని నరేంద్ర మోదీ  సూచించారు. పైస్థాయి నుంచి కిందివరకు అలాగే కిందిస్థాయి నుంచి పైవరకు ప్రజలకు, పాలనాయంత్రాంగానికి మధ్య సత్సంబంధాలు ఉండాలని సూచించారు. 

ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లతోపాటు కొంతమంది ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక పాలనా యంత్రాంగాల మధ్య టీమ్‌వర్కుతో ఆశావహ జిల్లాల్లో సత్ఫలితాలు వస్తున్నాయని ఉదహరించారు. ఈ ఆశావహ జిల్లాలు మరింత పురోగతి సాధించాలంటే ప్రజలు, పాలనా యంత్రాంగాల మధ్య ప్రత్యక్ష సంబంధాలు మరింత మెరుగుపడాలని హితవు పలికారు. 

సాంకేతికత, నవ కల్పనల ద్వారా పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో ఉన్న ఇబ్బందులను పరిష్కరించడం ద్వారా ఎలాంటి ప్రగతి సాధించవచ్చునో ఆశావహ జిల్లాలు నిరూపించాయని తెలిపారు.

దేశ వ్యాప్తంగా వెనుకబడిన 112 జిల్లాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 2018 లో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఆశావహ జిల్లాల అభివృద్ది పథకం ( ట్రాన్సఫర్మేషన్ ఆఫ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ స్కీమ్ ) అని దీనికి పేరు పెట్టింది.

 తెలంగాణ నుంచి భూపాల పల్లి, ఆసిఫాబాద్, ఖమ్మం, తదితర వెనుకబడిన జిల్లాలు ఈ పథకంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ నుంచి విజయనగరం, విశాఖపట్టణం, కడప తదితర జిల్లాలు ఉన్నాయి. ప్రధాని ఈ సందర్భంగా ప్రతి జిల్లాకు రెండేళ్ల విజన్ నిర్ణయించారు. 

ప్రతి జిల్లా వచ్చే మూడు నెలల్లో 10 లక్షాలను నిర్దేశించుకుని సామాన్య ప్రజలు సౌఖ్యంగా ఉండేలా సేవలను సంతృప్తికరంగా అందించాలని ఆయన సూచించారు. డిజిటల్ ఇండియా రూపంలో దేశంలో నిశ్శబ్ద విప్లవం సాగుతోందని, దీని నుంచి ఏ జిల్లా మినహాయింపు కారాదని సూచించారు.

ప్రతి గ్రామానికి డిజిటల్ సౌకర్యం విస్తరించేలా చూడాలని, ప్రతి ఇంటికి ఈ విధంగా సేవలు అందించాలని సూచించారు.  జిల్లా కలెక్టర్ల మధ్య రెగ్యులర్‌గా సంబంధాలు ఉండేలా సాధనాన్ని రూపొందించాలని నీతి ఆయోగ్‌కు సూచించారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సిఇఒ అమితాబ్ కాంత్ ఆశావహ జిల్లాల మొత్తం పురోగతి, అమలు విధానాలను సమీక్షించారు.

వెనుకబడిన జిల్లాలను వేగంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో 2018 జనవరిలో ఆకాంక్ష జిల్లాల కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ 112 జిల్లాలను ఎంపిక చేసి అభివృద్ధి బాట పట్టించారు. ఇప్పుడు కొన్ని రంగాల్లో వెనుకబడిన మరో 142 జిల్లాలను ఎంపిక చేశామని, ఆ జిల్లాల్లో కూడా అభివృద్ధికి అందరూ కలసికట్టుగా కృషి చెయ్యాలని ప్రధాని కలెక్టర్లకు పిలుపునిచ్చారు.

జిల్లాల్లో అన్ని గ్రామాలకు రోడ్డు సదుపాయం, అర్హులైన లబ్ధిదారులకి ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులు, ప్రతీ ఒక్కరికీ బ్యాంకు అకౌంట్, ప్రతీ కుటుంబానికి ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్, ఇన్సూరెన్స్, పెన్షన్‌ ఇవన్నీ నిర్దేశిత కాలవ్యవధిలోగా పూర్తి చేయాలని చెప్పారు. రెండేళ్లలో ఈ 142 జిల్లాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. దేశంలో డిజిటల్‌ విప్లవం చాలా నిశ్శబ్దంగా జరిగిపోతోందని, పల్లె పల్లెలోనూ డిజిటల్‌ సదుపాయాల కల్పన జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్లని ఆదేశించారు.