కరోనా మహమ్మారి ఎక్కడా ముగింపు దశకు చేరుకోలేదు

కరోనా మహమ్మారి ఎక్కడా ముగింపు దశకు చేరుకోలేదు. ఒమిక్రాన్ వేరియంట్‌తో సగటున వ్యాధి తీవ్రత తక్కువగా ఉండొచ్చు. కానీ ఇది తేలికపాటి వ్యాధి అన్న భావన మాత్రం పూర్తిగా తప్పుదారి పట్టించేదిగా ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్ టెడ్రోస్ అథనామ్ హెచ్చరించారు. ఒమిక్రాన్ వల్ల ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య, మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు. 

ఒమిక్రాన్ దూసుకెళ్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని, దానివల్ల కొత్త వేరియంట్లు పుట్టుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఫ్రాన్స్, జర్మనీ, బ్రెజిల్ దేశాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదైన తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ తీవ్రంగా వ్యాపిస్తోందని, ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా ఒమిక్రాన్ వల్ల రెండు కోట్ల పాజిటివ్ కేసులు నమోదయ్యాయని హెచ్చరించారు. 

మరీ ముఖ్యంగా ఐరోపాను వణికిస్తోందని టెడ్రోస్ పేర్కొన్నారు. తాజాగా జర్మనీలో కేసులు లక్ష దాటాయి. అక్కడ 1,12,323 మంది వైరస్ బారిన పడ్డారు. అలాగే ఫ్రాన్స్‌లో దాదాపు 5 లక్షల కేసులొచ్చాయి. ఐరోపాలో గతవారం 50 లక్షల కేసులు నమోదయ్యాయి. అక్కడ మార్చి నాటికి సగం మంది ఐరోపా వాసులకు ఒమిక్రాన్ సోకుతుందని ఆరోగ్యసంస్థ అంచనా వేసింది.

మరో వైపు బ్రెజిల్‌లో రికార్డు స్థాయిలో లక్షా 40 వేల కొత్త కేసులొచ్చాయి. గత సంవత్సరం ఆ దేశం కరోనా రెండో వేవ్‌తో అల్లాడిపోయింది. ఆ సమయంలో ఒక్క రోజే 4 వేల మరణాలు సంభవించాయి. కరోనా కేవలం ఫ్లూ అని కొట్టి పారేసిన ఆ దేశ అధ్యక్షుడు జైర్ బొల్సనారో తీవ్ర విమర్శల పాలయ్యారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను కూడా ఆయన తేలిగ్గా తీసుకుంటున్నారు. అలాగే ఒక దుకాణంలో హ్యామ్‌స్టర్స్ ( ఎలుక జాతి) లో కరోనా వైరస్‌ను గుర్తించడంతో పెంపుడు జంతువులను విక్రయించే దుకానాలకు సంబంధించి హాంకాంగ్ తీవ్ర నిర్ణయం తీసుకుంది.

రెండు వేలకు పైగా హ్యామ్ స్టర్స్‌ను చంపేయాలని నిర్ణయించింది. దాంతో అక్కడి ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెంపుడు జంతువుల నుంచి మనుషులకు కరోనా వ్యాప్తి చెందుతుందని అంతర్జాతీయంగా ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. కానీ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం అని అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది.