న్యూజిలాండ్‌ పార్లమెంట్ సభ్యురాలిగా 18 ఏళ్ళ తెలుగమ్మాయి

న్యూజిలాండ్‌లో తెలుగింటి అమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది. ఎపిలోని ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన (18) న్యూజిలాండ్‌ దేశ యూత్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఆ దేశంలో నామినేటెడ్‌ ఎంపి పదవుల ఎంపిక జరిగింది. 
 
ఇందులో భాగంగా ‘సేవా కార్యక్రమాలు, యువత’ విభాగానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్‌ సభ్యురాలిగా మేఘన ఎంపికయ్యారు. వాల్కటో ప్రాంతం నుంచి మేఘనకు ఈ నామినేటెడ్‌ పదవి దక్కింది. ఫిబ్రవరిలో ఎంపి గా మేఘన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మేఘన పాఠశాల రోజుల నుంచే సేవా  కార్యక్రమాలను చేపట్టారు. తన స్నేహితులతో కలిసి విరాళాలు సేకరించి అనాథ శణాలయాలకు అందజేస్తూ వచ్చారు. వలస వచ్చిన ఇతర దేశాల శరణార్థులకు విద్య, ఆశ్రయం, ఇతర వసతులను కల్పించడంతో ఆమె ఎంతో కృషి చేశారు. 

 
దీంతో న్యూజిలాండ్‌ ప్రభుత్వం మేఘనను పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపిక చేసింది. గత ఏడాది డిసెంబర్‌ 16 న జరిగిన ఈ పార్లమెంట్‌ సభ్యురాలి ఎంపిక విషయాన్ని వాల్కటో ప్రాంత ప్రభుత్వ ఎంపి టీమ్‌ నాన్‌ డమోలెస్‌ మేఘన కుటుంబానికి తెలిపారు.

మేఘన తల్లిదండ్రులు న్యూజిలాండ్‌లోనే స్థిరపడ్డారు. ఆమె తండ్రి గడ్డం రవికుమార్‌ ఉద్యోగ రీత్యా 2001లో న్యూజిలాండ్‌కు వెళ్లారు. 21 సంవత్సరాల కిందటనే భార్యతో న్యూజిలాండ్‌ వెళ్లిన రవికుమార్‌ అక్కడే స్థిరపడిపోయారు. ఇక అక్కడే పుట్టి పెరిగిన మేఘన కేంబ్రిడ్జిలోని సెయింట్‌ పీటర్స్‌ హైస్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు.