ఈనెల 26న జరిగే రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనేందుకు సుమారు 24,000 మందిని మాత్రమే అనుమతించనున్నట్టు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తుండటాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
రక్షణ శాఖ వర్గాల సమాచారం ప్రకారం, భారతదేశంలో కరోనా రాకముందు రిపబ్లిక్ డే పరేడ్కు 1.25 లక్షల మందిని ఆహ్వానించారు. గత ఏడాది కరోనా ఆంక్షల మధ్య 25,000 మందిని అనుమతించారు. ఈ ఏడాది 24,000 మందిని అనుమతిస్తుండగా, వీరిలో 19,000 మంది వరకూ ఆహ్వానితులు ఉంటారు. తక్కిన జనరల్ పబ్లిక్ టిక్కెట్లు కొనుక్కుని రావాల్సి ఉంటుంది.
కరోనా ప్రొటోకాల్స్ అమలులో ఉంటాయి. సీట్ల ఏర్పాట్ల విషయంలో కూడా సామాజిక దూరం పాటించాల్సి ఉంటుంది. ప్రతిచోటా శానిటైజర్ డిస్పెన్సర్లు అందుబాటులో ఉంచుతారు. మాస్క్లు ధరించడం తప్పనిసరి. గత ఏడాది తరహాలోనే ఈ ఏడాది కూడా రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా విదేశీ ప్రముఖులెవరినీ ఆహ్వానించకపోవచ్చని కూడా ఈ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, ఈ ఏడాది నుంచి 24వ తేదీన కాకుండా సుభాష్ చంద్రబోస్ జయంతి రోజైన జనవరి 23 నుంచే రిపబ్లిక్ డే ఉత్సవాలను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. ఇప్పటికే నేతాజీ జయంతిని పరాక్రమ దివాస్ గా జరుపుతామని కేంద్రం ప్రకటించింది.
More Stories
పూంచ్లో ఉగ్రవాదుల కోసం భారీగా గాలింపు
జమ్మూకాశ్మీర్లో భారీ ఉగ్రదాడి.. ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై కాల్పులు
వన్డేలు, టీ20లో అగ్రస్థానంలో టీమ్ఇండియా