లడఖ్ ప్రాంతంలో ముప్పు కొనసాగుతోంది

లడఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి చైనా దళాల ఉపసంహరణ పాక్షికంగా జరిగినప్పటికీ, ఈ ప్రాంతంలో ముప్పు కొనసాగుతోందని భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఎంఎం నరవనే చెప్పారు.
ముప్పు ఉన్నప్పటికీ చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)ని భారత సైన్యం స్థిరంగా, దృఢ సంకల్పంతో ఎదుర్కొంటుందని తెలిపారు. వార్షిక ఆర్మీ డే సందర్భంగా  జరిగిన  మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2020లో సైనిక ప్రతిష్టంభన ప్రారంభమై, 2022లో కూడా కొనసాగుతున్న ప్రాంతాల్లో దళాలను పెంచినట్లు తెలిపారు.
ఉత్తర, పశ్చిమ సరిహద్దులు (చైనా, పాకిస్థాన్) వెంబడి గత ఏడాది జనవరి నుంచి సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఉత్తర సరిహద్దుల్లో (చైనా) తాము నిరంతరం కార్యకలాపాల నిర్వహణకు సన్నద్ధతను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. అదే సమయంలో పీఎల్ఏతో చర్చల ద్వారా సంబంధాలను ఏర్పరచుకున్నట్లు తెలిపారు.
తూర్పు లడఖ్‌ నుంచి దళాల ఉపసంహరణ, బుధవారం జరుగుతున్న భారత్, చైనా సీనియర్ మిలిటరీ కమాండర్ల 14వ విడత చర్చల గురించి మాట్లాడుతూ, పెట్రోలింగ్ పాయింట్ 15 సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇది పరిష్కారమైతే ప్రస్తుత ప్రతిష్టంభనకు కారణమైన ఇతర అంశాలను పరిశీలిస్తామని తెలిపారు.
పాకిస్థాన్ వైపు ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో చేరుకుని, మన దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మన దేశంలోకి చొరబడేందుకు ఆ ఉగ్రవాదులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. దీనినిబట్టి మన పశ్చిమ దిశలోని పొరుగు దేశం (పాకిస్థాన్) పన్నుతున్న కుట్రపూరిత పన్నాగాలు బయటపడుతున్నాయని పేర్కొన్నారు.
నాగాలాండ్‌లో సాధారణ పౌరులపై సైన్యం కాల్పుల సంఘటనపై మాట్లాడుతూ, దర్యాప్తు పూర్తయిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.  స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌లో మరిన్ని దిద్దుబాటు చర్యలు చేపడతామని చెప్పారు.
ఈశాన్య భారతంలో పరిస్థితి నియంత్రణలో ఉందని చెబుతూ భారత్-మయన్మార్ సరిహద్దులో అస్సాం రైఫిల్స్ బెటాలియన్లను పెంచాలనే ప్రణాళిక ఉందని తెలిపారు. ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో సుమారు 5,300 మంది భారత సైనికులు ఉన్నారని తెలిపారు.