విజయవంతంగా బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్‌ పరీక్ష

బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత్ ఈ రోజు విజయవంతంగా పరీక్షించింది. ‘సీ-టు-సీ’ వేరియంట్ అయిన ఈ క్షిపణిని పశ్చిమ తీరంలో నేవీ విధ్వంసక నౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం పైనుంచి పరీక్షించారు.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన ఈ క్షిపణి గరిష్ట పరిధి వద్ద నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి కచ్చితత్వంతో తుత్తునియలు చేసినట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు, బ్రహ్మోస్ మిసైల్ బృందాన్ని అభినందించారు.
బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత్-రష్యా కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. వీటిని జలాంతర్గాములు, నౌకలు, విమానాలతోపాటు భూ ఉపరితలం పైనుంచి కూడా ప్రయోగించవచ్చు. ఈ క్షిపణలు 2.8 మాక్ వేగంతో అంటే దాదాపు శబ్దవేగానికి మూడు రెట్ల వేగంతో ప్రయాణిస్తాయి.
నవంబరు 2020లో బ్రహ్మోస్ ల్యాండ్ అటాక్ వెర్షన్‌ను అండమాన్ అండ్ నికోబార్ దీవుల నుంచి విజయవంతంగా పరీక్షించారు. శ్రేణి వ్యవస్థ పరంగా బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ మిసైల్. ఇటీవల డీఆర్‌డీవో దీని పరిధిని 298 కిలోమీటర్ల నుంచి 450 కిలోమీటర్లకు పెంచింది.
అలాగే, గతేడాది డిసెంబరులో బ్రహ్మోస్ ఎయిర్ వెర్షన్‌ను సూపర్‌సోనిక్ విమానం సుఖోయ్ 30 ఎంకే-I నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ వద్ద ఈ పరీక్ష నిర్వహించారు. ఈ విజయంతో వీటి ఉత్పత్తికి మార్గం సుగమమైంది. బ్రహ్మోస్ క్షిపణి 300 కేజీల వార్‌హెడ్ల (సంప్రదాయ, అణువార్‌హెడ్లు)ను మోసుకెళ్లగలదు. లక్ష్యాన్ని ఇది 99.99 కచ్చితత్వంతో ఛేదించే సత్తా దీని సొంతం.