ఉద్యోగుల మధ్య కొట్లాట పెడుతున్న ప్రభుత్వం

అనాలోచితంగా తెచ్చిన జీవో 317తో ప్రభుత్వం ఉద్యోగుల మధ్య స్థానిక, స్థానికేతర కొట్లాట పెడుతున్నదని అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో లోపాలను సవరించాలని జాగరణ దీక్ష పేరుతో తాను నిరసన చేపడితే నిరంకుశంగా వ్యవహరించి, పోలీసులు దాడి చేశారని మంది పడ్డారని విచారం వ్యక్తం చేశారు. 

తనను అరెస్టు చేసే సమయంలో పలువురు నాయకులు, కార్యకర్తలకు తీవ్రంగా గాయాలయ్యాయని చెబుతూ ఇంకా ఐదుగురు కార్యకర్తలు జైలులోనే ఉన్నారని పేర్కొన్నారు. ఇష్టానుసారం అర్ధరాత్రి 317 జీవో తెచ్చారని, దీనిలో లోపాల కారణంగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్థానిక- స్థానికేతర అంశాలతో  మనస్తాపానికి గురై ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

నలుగురు అమాయకులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వంలో స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే ధర్మ యుద్ధంలో కేసీఆర్ సంగతి చూస్తామని సంజయ్  హెచ్చరించారు. కేసీఆర్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నాడని చెబుతూ చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. 

కాషాయ జెండా చేతపట్టి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఉద్యోగులు ఎవరూ అధైర్య పడొద్దని, వారి కోసం బీజేపీ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. పోరాటాలను అడ్డుకోవడానికి కేసులు, అరెస్టులనే సీఎం కేసీఆర్ ఆయుధంగా ఎంచుకుంటే జైళ్లనే బీజేపీ ఉద్యమాల గడ్డగా మార్చుకుంటుందని హెచ్చరించారు. 

తమ పార్టీ నేతలు కేసులకు బెదిరిపోరని, 317 జీవోను సవరించే వరకూ పోరాటం ఆగదని చెప్పారు. ప్రజల కోసం చేసిన పోరాటాల్లో ఎమ్మెల్యే రాజా సింగ్‌పై 100కు పైగా కేసులు పెట్టినా బెదరలేదని గుర్తు చేశారు. తాను తొమ్మిది సార్లు జైలుకు పోయానని, ప్రజల కోసం ఎన్నిసార్లైనా పోవడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు.

రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని చెబుతూ  317 జీవోను రద్దు చేసి సొంత ప్రాంతాల్లోనే ఉద్యోగాలు చేసుకునేలా మార్పులు చేస్తామని సంజయ్ హామీ ఇచ్చారు.