మూడు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటి సోదాలు

హైదరాబాద్ లోని మూడు రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు ఎపి, తెలంగాణ, కర్ణాటక సోదాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మూడు రాష్ట్రాలలో 25 చోట్ల ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. 
 
హైదరాబాద్, కర్నూలు, అనంతపురం, నంద్యాల, కడప, తాడిపత్రి, బెంగళూరు, బళ్లారిలో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో పెద్దఎత్తున అక్రమాలు బయటపడ్డాయి. బుధవారం నుంచి హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ నవ్య కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. 
 
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పలు చోట్ల నవ్యసంస్థ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను చేపట్టింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్, పటాన్‌చెరులోని సంస్థ కార్యాలయాల్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం మూడు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో తనికీలు చేపట్టారు.
 
ఈనేపథ్యంలో సోదాలలో ఐటి అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని బల్కంపేటలోని స్కందాన్షీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్, రాగ మయూరి రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన కార్యాలయాలు, ఆ సంస్ధల మేనేజింగ్ డైరెక్టర్లు, డైరెక్టర్ల ఇళ్లలో కూడా ఐటి బృందాలు సోదాలు నిర్వహించాయి. 
 
ఈ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారుల నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇక సోదాలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లోకి ఎవరూ రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఈ సంస్థలు ఇప్పటి వరకు పూర్తి చేసిన ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల గురించి ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. మరో రెండు రోజుల్లో గుంటూరు, కృష్ణా, నెల్లూరు సోదాలు నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.