
టీఆర్ఎస్ వైఫల్యాలను ఆసరాగా తీసుకొని తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని రాష్ట్ర పార్టీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడంలో నేతలు సఫలీకృతం అవుతున్నారని, మరోవైపు టీఆర్ఎస్పై ప్రజాగ్రహం రోజురోజుకూ పెరుగుతోందని చెప్పారు.
ఈ నేపథ్యంలో వచ్చే 2023 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా నాయకులందరూ కలసికట్టుగా పనిచేయాలని ఆదేశించారు. గురువారం రాత్రి మహేశ్వరం మండలంలోని మాక్ ప్రాజెక్ట్లో పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో.. బెయిల్పై బయటకు వచ్చిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను, ఇతర నాయకులను నడ్డా అభినందించారు.
‘మీ పోరాటం ప్రజల కోసం ఉండాలి.. టిక్కెట్ల కోసం కాదు. పాతవారు, కొత్తవారు కలిసి పనిచేయండి. మీకు అండగా జాతీయనాయకత్వం, కేంద్ర ప్రభుత్వం ఉంది’ అని భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు కొనసాగించాలని, ఏ దశలోనూ రాజీ పడవద్దని స్పష్టం చేశారు.
వివిధ వర్గాల ప్రజల సమస్యలు, అంశాలపై మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లి బీజేపీకి అనుకూలంగా మద్దతు కూడగట్టాలని నడ్డా సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనపై పట్టుకోల్పోవడంతోపాటు హామీల అమల్లో వైఫల్యం చెందిందని, దీనిని జీర్ణించుకోలేకే ఆ పార్టీ పెద్దలు సంయమనం, గౌరవ మర్యాదలు కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు.
బండి సంజయ్ మాట్లాడుతూ.. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో పార్టీ చేస్తున్న ఉద్యమానికి అండగా నిలిచిన జాతీయ పార్టీకి, ముఖ్యంగా జేపీ నడ్డాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ గొప్ప ఉద్యమంలో రాష్ట్ర నాయకులు కూడా అండగా నిలిచారని పేర్కొన్నారు. ఇకముందు కూడా టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో కలిసికట్టుగా ముందుకెళదామని పిలుపునిచ్చారు.
ఛత్తీస్గఢ్ మాజీ సీఎం డాక్టర్ రమణ్సింగ్, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి తరుణ్ ఛుగ్, పార్టీ నేతలు డాక్టర్ కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఏపీ జితేందర్రెడ్డి, డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి, నల్లు ఇంద్రసేనారెడ్డి, రాజాసింగ్ తదితరులు హాజరయ్యారు.
More Stories
పాకిస్థాన్ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్
తమిళనాడులో రూ.1000 కోట్ల లిక్కర్ స్కామ్!
15 నెలల్లో తెలంగాణ ప్రభుత్వ అప్పు రూ. రూ. 1.52 లక్షల కోట్లు