భారత్ లో ఇప్పటి వైరస్ ఉధృతి ప్రారంభం మాత్రమే

భారత్‌లో వైరస్‌ వ్యాప్తి చాలా వేగంగా ఉందని, ఇప్పుడు కనిపిస్తున్న ట్రెండ్‌ కేవలం ప్రారంభం మాత్రమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్యా స్వామినాథన్‌ హెచ్చరించారు. కాబట్టి భారతీయులు జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.

పెద్ద సంఖ్యలో జనం గుమికూడటం, విందు, వినోద కార్యక్రమాలు ఒమిక్రాన్‌ వ్యాప్తిని భారీగా పెంచుతుందని ఆమె తెలిపారు. దక్షిణాఫ్రికా, బ్రిటన్‌ నుంచి వచ్చిన ఒమిక్రాన్‌ గణాంకాల్ని విశ్లేషించాక..కొత్త వేరియెంట్‌ అత్యంత ప్రమాదకర స్థాయిలో వ్యాప్తి చెందుతున్న విషయాన్ని గుర్తించామని ఆమె చెప్పారు. 

”ఒమిక్రాన్‌ సోకాక చాలామందిలో లక్షణాలు కనిపించటం లేదు. అయినా రోగులు వైద్యుల సలహాలు తీసుకోవాలి. హెల్త్‌ వర్కర్ల సేవలు అవసరం అవుతాయి” అని ఆమె పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి కట్టడి కోసం భారత్‌ అమలుజేస్తున్న నైట్‌ కర్ఫ్యూలు, ఇతర చర్యల్లో శాస్త్రీయత లేదని ఆమె స్పష్టం చేశారు.

ఒమిక్రాన్‌ను అరికట్టేందుకు టెలీవైద్య సేవలు ఉపయోగించాలని ప్రపంచ దేశాలకు ఆమె  సూచించారు. ఒమిక్రాన్‌ కేసుల్లో ఐసీయూ, హాస్పిటల్‌లో చేరటం తక్కువగా ఉందని, అవుట్‌ పేషెంట్‌, ఇంటివద్ద చికిత్స పొందే బాధితుల సంఖ్య పెరిగే అవకాశముందని ఆమె చెప్పారు. 

ఒమిక్రాన్‌ కేసుల్లో మరణాల శాతం తక్కువగా ఉందని, అంత మాత్రం చేత రిస్క్‌ పెద్దగా లేదని తేలిగ్గా తీసుకోవద్దని ఆమె హెచ్చరించారు. ఒక్కసారిగా కేసుల నమోదుతో హాస్పిటల్స్‌లో రోగుల చేరిక, వైద్య సిబ్బందిపై తీవ్రమైన ఒత్తిడి పడకుండా ప్రభుత్వాలే జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.