ఢిల్లీలో 10 రేట్లు పెరిగిన కరోనా కేసులు 

డిసెంబర్ ప్రారంభంతో పోలిస్తే ఢిల్లీలో కరోనా కేసులు పది రెట్లు పెరిగాయి. కేసులు పెరుగుతున్నతీరును చూస్తే ఒమిక్రాన్ ప్రభావం కనిపిస్తున్నదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరికల్లా ఢిల్లీలో కేసులు శిఖరస్థాయికి చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు.

ఢిల్లీలో ఆదివారం 290 కొత్త కేసులు నమోదు కాగా, పాజిటివిటీ రేట్ 0.55గా రికార్డయింది. సోమవారం 331 కేసులు నమోదు కాగా, పాజిటివిటీ రేట్ 0.68కు ఎగబాకింది. డిసెంబర్ 1న ఢిల్లీలో 39 కొత్త కేసులతో పాజిటివిటీ రేట్ 0.07గా నమోదైంది. మరుసటిరోజు 41 కేసులతో 0.06కు పాజిటివిటీ తగ్గింది. 

డిసెంబర్ 9 నుంచి 15 మధ్య సగటున రోజుకు 48 కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 16 నుంచి 22 వరకు సగటున రోజుకు 95 కేసులు నమోదయ్యాయి. దాంతో,వారంలో పాజిటివిటీ రేట్ 49.47కు ఎగబాకింది. వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ ప్రభావం వల్ల కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నట్టుగా ఉన్నదని అంటువ్యాధుల నిపుణుడు గిరిధర్ ఆర్ బాబు పేర్కొన్నారు.

కేసులు ఒక్కసారిగా పెరగడం, తగ్గడంలాంటివి జరుగుతాయని తెలిపారు. కేసుల సంఖ్య జనవరి మధ్య నుంచి ఫిబ్రవరి మధ్య వరకల్లా శిఖరస్థాయికి చేరనున్నట్టు ఆయన అంచనా వేశారు. కేసులు, పాజిటివిటీ రేట్ పెరుగుతున్నా మరణాలు అధికంగా ఉండవని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో అంటువ్యాధుల విభాగం హెడ్ డాక్టర్ జుగల్‌కిషోర్ చెప్పారు. 

ఇప్పుడు రికార్డవుతున్న కేసుల్లో 60 నుంచి 70 శాతం వరకు ఒమిక్రాన్‌వి, మిగతావి వేరే వేరియంట్లవి ఉండవచ్చునని ఆయన తెలిపారు. చలికాలంలో మూసిన గదుల్లో ఎక్కువగా గడపడం వల్ల వైరస్ కేసులు పెరుగుతాయని ఆయన తెలిపారు.  వ్యాక్సిన్ తీసుకోనివారు, ఇప్పటివరకు ఇన్‌ఫెక్షన్‌కు గురికానివారి విషయంలో ఎక్కువ జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. వ్యాక్సిన్ వల్ల ఇన్‌ఫెక్షన్ రాదని భరోసా ఇవ్వలేం. కానీ, తీవ్రతను తగ్గిస్తుందని చెప్పగలమని ఆయన అన్నారు.

కేరళలో రాత్రి కర్ఫ్యూ 
 
కేరళ రాష్ట్రంలో పెరుగుతున్న ఒమైక్రాన్ కేసుల కట్టడికి డిసెంబరు 30వతేదీ నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించారు. కేరళలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. 
 
డిసెంబరు 30 నుంచి జనవరి 2వతేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని కేరళ అధికారులు చెప్పారు. రాత్రి కర్ఫ్యూ సందర్భంగా దుకాణాలను రాత్రి 10గంటలలోపు మూసివేయాలని ఆదేశించారు. జనం గుమిగూడేలా సమావేశాలను అనుమతించమని అధికారులు చెప్పారు.
 
బార్ లు, హోటళ్లు, క్లబ్ లు, రెస్టారెంట్లను రాత్రి 10 గంటలవరకే 50 శాతం సీటింగుతో అనుమతిస్తామని చెప్పారు. బీచ్ లు, షాపింగ్ మాల్స్, పార్కుల్లో ఆంక్షలు అమలు చేయనున్నారు.కేరళలో 57 ఒమైక్రాన్ కేసులు వెలుగుచూశాయి. కేరళలో సోమవారం ఒక్కరోజే 1636 కొవిడ్ కేసులు వెలుగుచూడగా, 236 మంది మరణించారు.