
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి సుపరిపాలనకు ఆదర్శంగా నిలిచారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. ‘‘వాజపేయి సభలో మాట్లాడుతుంటే అందరూ ఆసక్తిగా వినేవారు.. నేడు పార్లమెంటులో కాగితాలు చింపి గోల చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో అయితే ఏకంగా బూతులే మాట్లాడుతున్నారు” అంటూ ఎద్దేవా చేశారు.
నేడు వాజపేయిని అందరూ ఎందుకు గుర్తు చేసుకుంటున్నారో నేటి నేతలు ఆలోచించాలని ఆయన కోరారు. నేడు ఏపీలో రోడ్లు వేయాలంటే… కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు తీసుకుంటారని, కానీ గ్రామీణ సడక్ యోజనకింద వాజపేయి రోడ్లు వేశారని ఆయన గుర్తు చేసారు. అయితే సీఎం జగన్మోహన్రెడ్డి మాత్రం గంపెడు మట్టి కూడా వేయలేకపోయారని ధ్వజమెత్తారు.
ఏదైనా పనికి కాంట్రాక్టర్ని పిలిస్తే… రాలేని దుస్థితి ఏపీలో ఉందని వీర్రాజు మండిపడ్డారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక…ప్యాలెస్ వీడటం లేదని, రోడ్డు మీదకు రావడం లేదని దుయ్యబట్టారు. గతంలో వంట గ్యాస్ కోసం ప్రజలు అనేక పాట్లు పడేవారు.దీపం పథకం కింద వాజపేయి ప్రతి ఇంటికి గ్యాస్ అందించారని ఆయన గుర్తు చేశారు.
ఏపీలో గత సీఎం, ప్రస్తుత సీఎం ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. గత పాలకులు గ్రాఫిక్స్తో మాయ చేస్తే…నేటి పాలకులు మాటలతో మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని వీర్రాజు డిమాండ్ చేశారు.
అభివృద్ధిని చేసే వాటిని బ్లాక్ మెయిల్ చేస్తున్న పార్టీలు ఏపీలో ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సీఎం, ఇప్పటి సీఎంకు అభివృద్ధి చేసే దమ్ముందా? పనులు చేయరు…చేసే వారిని అడ్డుకుంటారా..? మీలాంటి వారికి తగిన బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయని బిజెపి నేత హెచ్చరించారు.
వాజపేయి వచ్చే వరకు ఎస్టీలకు క్యాబినెట్లో చోటు లేదని చెబుతూ ఎస్టీల కోసం వాజపేయి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని ఆయన కొనియాడారు. వాజపేయి వచ్చాకే చాలా వైద్య కాలేజీలు వచ్చాయని అంటూ పథకం కేంద్రానిది అయితే.. చిన్న బొమ్మ వేస్తారు… రంగులు మాత్రం వారి పార్టీవి వేస్తారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో పౌష్టికాహారం పేరుతో కుళ్లిన గుడ్లు పెడతారా..? అని వీర్రాజు నిలదీశారు. దేశంలో కమ్యూనిస్టులు కమీషన్ల ఏజెంట్లుగా మారారని అంటూ దేశంలో విద్యా వ్యవస్థను కమ్యూనిస్టులే నాశనం చేశారని మండిపడ్డారు. అంబేద్కర్ గురించి అద్భుతంగా మాట్లాడటం కాదు..వారి ఆలోచనలను ఆచరణలో పెట్టాలని హితవు చెప్పారు. సమాజాన్ని మేల్కొలిపే విధంగా తమ వంతు కార్యక్రమాలు చేపడతామని వీర్రాజు స్పష్టం చేశారు.
More Stories
జీఎస్టీ సంస్కరణలతో ఏపీ ఆరోగ్య రంగంలో రూ. 1,000 కోట్ల ఆదా
ఆలయాలు, టాయిలెట్లు ఒకటేనా షర్మిలా!
అంతర్వేది తీరంలో సముద్రం వెనుకంజ