హనీట్రాప్‌లో దేశంలోని పలువురు సైనాధికారులు

ఢిల్లీకి చెందిన మహిళా న్యాయవాది విసిరిన వలపుల వల(హనీట్రాప్‌)లో దేశంలోని పలువురు సైనాధికారులు చిక్కుకున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్‌ వెల్లడించింది. ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలతో ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటిబిపి) విభాగం సదరు మహిళకు దూరంగా ఉండాలని భద్రతా అధికారులను హెచ్చరిస్తూ మెమొరాండం జారీ చేసింది. 

ఢిల్లీ మహిళా న్యాయవాది తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం సైనిక రహస్య సమాచారాన్ని రాబట్టేందుకు అధికారులతో తనకున్న సంబంధాన్ని ఉపయోగించుకున్నట్లు ఐటిబిపి నివేదించింది. భారత సైనికాధికారులతో మహిళా న్యాయవాది సంబంధాలు పెంపొందించుకోవడానికి యత్నిస్తున్నట్లు తేలింది. 

ఆమె చర్యలు జాతీయ భద్రతకు విఘాతం కలిగించే విధంగా ఉన్నల్టు ఐటిబిపి తెలిపింది. ఆమె సీనియర్ అధికారులతో గల పరిచయాలను ఉపయోగించుకొని బదిలీలకు సిఫార్సులు చేయడం కూడా చేస్తున్నట్లు చెప్పారు. 

ఐటిబిపి విభాగాల్లోకి మహిళా న్యాయవాది రాకుండా నిషేధం విధించారు. ఢిల్లీ మహిళ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో ఇంటెలిజెన్స్‌ స్కానర్‌ లో ఉంచి రెడ్‌ ఫ్లాగ్‌ చేశారు. సదరు ఢిల్లీ మహిళ ఇటీవల జమ్మూకశ్మీరులోని సమస్యాత్మక ప్రాంతాల్ల్లో గడిపినట్లు తేలడంతో భద్రతా సంస్థలను అప్రమత్తం చేశారు. 

గత ఏడాది కాలంలో మహిళా న్యాయవాది జమ్మూ కశ్మీర్‌, రాజస్థాన్‌, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ వంటి సరిహద్దు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించారని దర్యాప్తులో తేలింది. 

ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రకు ఐటిబిపికి చెందిన ఉన్నతాధికారి ఒకరు ఆమెను వెంట తీసుకెళ్లారని వెల్లడైంది. తీస్‌ హజారీ కోర్టుకు చెందిన జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌గా ఆ మహిళ నటిస్తోందని కూడా లిఖితపూర్వక సమాచారం పేర్కొంది.