కేరళలో హలాల్‌ నిషేధించాలని బీజేపీ పిలుపు

రాష్ట్రవ్యాప్తంగా తినుబండారాలలో హలాల్ ఆహారం, హలాల్ బోర్డులను నిషేధించాలని కేరళ ప్రభుత్వాన్ని బీజేపీ డిమాండ్ చేసింది. ముస్లిం మతపెద్దలు ఆహారాన్ని హలాల్ చేయడానికి వాటిపై ఉమ్మి వేస్తారని సోషల్ మీడియాలో వాదనలు వెలువడిన తర్వాత బిజెపి డిమాండ్ వచ్చింది. 

శబరిమల ఆలయంలో ప్రసాదం తయారీకి హలాల్ సర్టిఫికేట్ ఉన్న బెల్లం ఉపయోగించారని ఆరోపిస్తూ గత వారం విశ్వహిందూ పరిషద్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎస్జేఆర్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.

బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సుధీర్ మీడియాతో మాట్లాడుతూ, హలాల్, ట్రిపుల్ తలాక్ వంటివి “సామాజిక దురాచారం” అని పేర్కొన్నారు. “హలాల్ అనేది మతపరమైన ఆచారం అని బిజెపి నమ్మదు. ఇస్లామిక్ పండితులు కూడా దానిని సమర్థిస్తారని భావించడం లేదు” అని స్పష్టం చేశారు. 

హలాల్‌కు మతపరమైన రూపాన్ని ఇవ్వడం ద్వారా, కేరళ సమాజంలో మతపరమైన ఎజెండాను అమలు చేయడానికి తీవ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో హలాల్ బోర్డులు అకస్మాత్తుగా పెరిగిపోతున్నాయని పేర్కొన్న సుధీర్, “ఇది మతం తరపున చేస్తుంటే, దానిని సరిదిద్దడానికి మతపెద్దలు సిద్ధంగా ఉండాలి” అని సూచించారు.

సుధీర్‌కు మద్దతుగా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్ కోజికోడ్‌లో మాట్లాడుతూ, కేరళలో “హలాల్ విజృంభణ” “యాదృచ్ఛికం లేదా అమాయకమైనది కాదు” అని పేర్కొన్నారు. కొన్ని మత తీవ్రవాదులు హలాల్ సంస్కృతిని ప్రోత్సహించడం వెనుక ఉన్నారని స్పష్టం చేశారు. 

ఆ శక్తులు కేరళ ప్రజలను విభజించి, సమాజంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టాలని చూస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హలాల్ సంస్కృతిని వ్యాప్తి చేయడం వెనుక స్పష్టమైన ఎజెండా ఉందని సురేంద్రన్ ఆరోపోయించారు

ప్రాంతీయ క్రైస్తవ పార్టీ కేరళ కాంగ్రెస్ (ఎం) మాజీ నాయకుడు పిసి జార్జ్ కూడా ఈ సమస్యలో చేరారు. ఇటీవలి కాలంలో తన కమ్యూనిటీ వ్యతిరేక వ్యాఖ్యలపై ముస్లిం సంస్థల ఆగ్రహాన్ని ఆహ్వానించిన మాజీ శాసనసభ్యుడు జార్జ్, హలాల్ ఆహారం మత ఛాందసవాదంలో భాగమని స్పష్టం చేసారు. 

“ముస్లింలకు ఆహారం మీద ఉమ్మివేయడం తప్పనిసరి. పిండిని పిసుకుతూ మూడుసార్లు ఉమ్మివేసేవారు. శబరిమలలోని ప్రసాదం తయారీకి హలాల్ బెల్లం వాడతారు కాబట్టి వాటిని ఉపయోగించకూడదు” అని క్రిస్టియన్ టీవీ ఛానెల్ షెకినా టీవీతో తేల్చి చెప్పారు. హిందువులు, ముస్లింలు,  క్రిస్టియన్లు “ఒకరిపై మరొకరు ఆర్థిక ముట్టడి విధించడం” ద్వారా జీవించలేరని బిజెపి అధికార ప్రతినిధి సందీప్ జి వారియర్ స్పష్టం చేశారు.