నటుడు కైకాలకు వెంటిలేటర్‌పై చికిత్స

దాదాపు ఆరు ద‌శాబ్ధాలుగా ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురై అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. గత నెల 30న ఆయన ఇంట్లో కాలుజారి కిందపడటంతో గాయాలై ఆసుపత్రిలో చేరారు. చికిత్స తర్వాత కాస్త ఆరోగ్యం మెరుగుపడిందని వార్తలు వచ్చాయి. 

ఇంతలోనే మళ్ళీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు కైకాలను అపోలోకు తరలించారు. ప్రస్తుతం కైకాల వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సత్యనారాయణ కుటుంసభ్యులకు ఫోన్‌ చేసి  ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. 

ఆయన క్షేమంగా తిరిగి రావాలంటూ సినీ అభిమానులు, పలువురు నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గత నెల 30న కైకాల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇంట్లో జారిపడటంతో కుటుంబసభ్యులు అప్పుడు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. 

కైకాల వయసు ప్రస్తుతం 88 ఏళ్లు. సత్యనారాయణ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో, కైకాల లక్ష్మీనారాయణకు 1935 జూలై 25 న జన్మించాడు. ఇక సినిమాల విషయానికి వస్తే 1959లో నారాయణ సిపాయి కూతురు అనే సినిమాలో సత్యనారాయణ వెండితెరకు పరిచయం అయ్యారు.  2019లో విడుదలైన ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’, ‘మహర్షి’ చిత్రాల తర్వాత ఆయన వెండితెరకు దూరంగా ఉన్నారు.

ఈ మధ్యనే, కైకాల సత్యనారాయణ పుట్టినరోజును పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి సత్యనారాయణ నివాసానికి వెళ్లారు. ‘తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు అంటూ కొనియాడారు. ఆయనతో కాసేపు ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి’… అని చిరు త‌న‌ ట్విట్టర్ ద్వారా తెలిపారు.