ప్రభుత్వ పాఠశాలలకు పెరుగుతున్న విద్యార్ధుల మొగ్గు

దేశంలో గత కొంతకాలంగా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్టు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల చేరికలు గణనీయంగా పెరిగినట్టు ‘వార్షిక విద్యాస్థితి నివేదిక (ఎఎస్‌ఇఆర్)2021’ సర్వేలో వెల్లడయ్యింది. 

ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, కేరళ, రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు అత్యధికంగా ఉన్నాయని తెలిపింది.విద్యాస్థితిని అంచనా వేసేందుకు దేశ వ్యాప్తంగా 25 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో అసర్ సర్వే నిర్వహించింది. వీటిలో 76,706 కుటుంబాలు, 5 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న 75,234 మంది చిన్నారులను సర్వే చేసింది.

కరోనా తర్వాత తిరిగి తెరచుకున్న 4872 పాఠశాలలతో పాటు తెరచుకోని 2427 పాఠశాలల ఇంఛార్జీల నుంచి సమాచారం సేకరించినట్టు అసర్ పేర్కొంది. దేశ వ్యాప్తంగా ప్రైవేటుతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరుగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

ముఖ్యంగా 6 నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో చేరడం, 2018 లో 32.5 శాతం ఉండగా, 2021 నాటికి అది 24.4 శాతానికి తగ్గిందని 16 వ అసర్ వార్షిక నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో 2018 లో ప్రభుత్వ పాఠశాలల్లో 64.3 శాతం ఉండగా, ప్రస్తుతం అది 70.3 శాతానికి పెరిగిందని తెలిపింది. 

అన్ని తరగతులతో చేరికలతోపాటు బాలురు, బాలికల సంఖ్య లోనూ ఈ పెరుగుదల కనిపించిందని వివరించింది. అయినప్పటికీ ప్రైవేటు స్కూళ్లలో చేరేవారి సంఖ్య బాలుర లోనే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించింది. ఇక దేశంలో 2006 నుంచి 2014 వరకు ప్రైవేటు స్కూళ్లలో చేరికలు విపరీతంగా పెరిగాయి. ఆ సమయంలో ప్రైవేటులో చేరికలు 30 శాతం పెరిగాయి. 

కానీ ఈ ఏడాది కరోనా వైరస్ వల్ల ప్రైవేటులో చేరికలు మరింత తగ్గినట్టు తాజా సర్వే వెల్లడించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి. అదే ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గుముఖం పట్టడంతోపాటు బడుల్లో నమోదు చేసుకోని చిన్నారుల సంఖ్య కూడా పెరిగింది.

ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు ఉత్తరప్రదేశ్‌లో అత్యదికంగా 13.2 శాతం పెరగ్గా, కేరళలో 11.9 శాతం పెరిగాయి. రాజస్థాన్‌లో 9.4 శాతం, మహారాష్ట్రలో 9.2 శాతం, కర్ణాటకలో 8.3 శాతం, తమిళనాడులో 9.6 శాతం, ఆ్ంరధ్రప్రదేవ్‌లో 8.4 శాతం పెరుగుదల కనిపించింది. తెలంగాణలో 3.7 శాతం, బీహార్‌లో 2.8 శాతం, పశ్చిమబెంగాల్‌లో 3.9 శాతం, ఝార్ఖండ్‌లో 2.5 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరిగాయి.