కెఫైన్ కొత్త పార్టీ `పంజాబ్ లోక్ కాంగ్రెస్’

కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేసిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇప్పుడు అధికారికంగా ఆ పార్టీకి రాజీనామా చేసి,  కొత్తగా  `పంజాబ్ లోక్ కాంగ్రెస్’ అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.   పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ప్రాధాన్యత కల్పించడంతో పాటు తన ప్రాధాన్యతకు అధిష్టానం చెక్ పెట్టడంతో అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి ఇటీవలనే రాజీనామా చేశారు. 
 
త్వరలోనే పార్టీని అధికారికంగా ఆవిష్కరిస్తామని, ఎన్నికల కమిషన్ పార్టీ పేరుకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని కూడా ఆయన చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తుందని అమరీందర్ చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఏడు పేజీల లేఖను పంపారు. ఆ లేఖలో తనకు వ్యతిరేకంగా అర్ధరాత్రి కాంగ్రెస్ శాసనసభ పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా ఆమె ఇంటి నుండే తనకు వ్యతిరేకంగా కుట్ర చేశారని
 
కొంతకాలంగా తీసుకుంటున్న నిర్ణయాలపై కాంగ్రెస్ అధిష్టానం పశ్చాత్తాప పడక తప్పదని కెప్టెన్  ఆమెనుహెచ్చరించారు.
తన పట్ల సోనియా గాంధీ, ఆ పార్టీ నేతలు, ఆమె సంతానం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ప్రవర్తించిన తీరు తనను తీవ్రంగా బాధించిందని ఆయన తెలిపారు.

‘‘మీరు, మీ పిల్లలు ప్రవర్తించిన తీరు నిజంగా నన్ను తీవ్రంగా బాధించింది. మీ పిల్లలను నేను ఇప్పటికీ ఎంతో ప్రేమిస్తున్నాను. వారి తండ్రి రాజీవ్ గాంధీ నాకు 1954  నుంచి అంటే 67 ఏళ్ళ నుంచి తెలుసు. బడిలో చదువుకున్న రోజుల నుంచి తెలుసు. అందువల్ల నా పిల్లలను ప్రేమించినంతగా వారిని ప్రేమిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. 

కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూపై కూడా ఈ లేఖలో ఆరోపణలు గుప్పించారు. సిద్ధూ పాకిస్థాన్ సైన్యం, ప్రభుత్వ పెద్దలతో అత్యంత సన్నిహిత సంబంధాలు నెరపుతున్నారని, పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ను, ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాను బహిరంగంగానే ఆలింగనం చేసుకున్నారని గుర్తు చేశారు. 

తాను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ సిద్ధూను పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించారని పేర్కొన్నారు. పంజాబ్‌తోపాటు దేశ ప్రయోజనాల కోసం తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. 

పంజాబ్ కాంగ్రెస్‌ శాఖలో ముఖ్య నేతల మధ్య అంతర్గత కలహాలు చాలా కాలం నుంచి కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూను పీసీసీ చీఫ్‌గా ఆ పార్టీ అధిష్ఠానం జూలైలో నియమించింది. అప్పటికీ నేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతో, కెప్టెన్ సింగ్‌ను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని సెప్టెంబరులో ఆదేశించింది. 

ఆయన రాజీనామా అనంతరం ముఖ్యమంత్రి పదవికి చరణ్‌జిత్ సింగ్ చన్నిని ఎంపిక చేశారు. చన్ని, సిద్ధూ మధ్య కూడా విభేదాలు కనిపిస్తున్నాయి. చన్ని ఎన్నికల ముందు ప్రజాకర్షక తాయిలాలు ప్రకటిస్తున్నారని సిద్ధూ తాజాగా ఆరోపించారు.