బ‌ద్వేల్ లో వైసీపీ విజ‌య‌దుందుభి

బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో అధికార‌ వైసీపీ విజ‌య‌దుందుభి మోగించింది. వైసీపీ అభ్య‌ర్థి దాస‌రి సుధ 90వేల‌కు పైగా మెజారిటీతో బీజేపీ అభ్యర్థి సురేష్‌పై ఘ‌న‌ సాధించారు. పోస్ట‌ల్ బ్యాలెట్‌తో క‌లిపి 90,228 ఓట్ల మెజారిటీని సాధించారు. గ‌త‌ ఎన్నిక‌ల్లో దాస‌రి సుధ‌ భ‌ర్త వెంక‌ట సుబ్బ‌య్య 44,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

కానీ ఈ ఎన్నిక‌ల్లో త‌న భ‌ర్త కంటే దాదాపు రెట్టింపు మెజారిటీని సాధించారు. దాస‌రి సుధ‌కు మొత్తం 1,11,710 ఓట్లు వ‌చ్చాయి. బీజేపీకి 21,621 ఓట్లు, కాంగ్రెస్‌కు 6,205 ఓట్లు, నోటాకు 3,622 ఓట్లు పోల‌య్యాయి. టిడిపి అభ్యర్థిని పోటీలో పెట్టలేదు. జనసేన మిత్రపక్షం బిజెపికి మద్దతు ఇచ్చింది.

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందిన వైసీపీ అభ్య‌ర్థి దాస‌రి వెంక‌ట సుబ్బ‌య్య ఈ ఏడాది మార్చి 28న అనారోగ్యంతో క‌న్నుమూశారు. దీంతో బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. దీంతో వైసీపీ అధిష్టానం.. బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థిగా దాస‌రి సుధ‌ను ఎంపిక చేసింది.

కాగా,  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెజార్టీ రికార్డ్‌ను అదే జిల్లాకు చెందిన బద్వేల్ అభ్యర్థి సుధ బ్రేక్ చేసేశారు. 2019 ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసిన వైఎస్ జగన్.. టీడీపీ అభ్యర్థి సింగా సతీష్ కుమార్ రెడ్డిపై 90,110 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.

అయితే ఆ రికార్డ్‌ను బద్వేల్‌ వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ బ్రేక్ చేసేశారు. 90,550 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గెలుపొందడం విశేషమని చెప్పుకోవచ్చు. అంటే జగన్ కంటే 440 ఓట్లు ఎక్కువ మెజార్టీనే.