పాక్ సరిహద్దు అడవిలో మూడు వారాలుగా భారీ ఆపరేషన్

పాకిస్థాన్ సరిహద్దున జమ్మూకాశ్మీర్‌లోని దట్టమైన అడవిలో ఉగ్రవాదుల కోసం సైన్యం చేపట్టిన ఆపరేషన్ ప్రారంభమై మూడు వారాలు గడిచింది. ఈ ఆపరేషన్ సందర్భంగా రెండు వేర్వేరు ఘటనల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 9 మంది సైనికులు మృతి చెందినట్టు ఓ అధికారి తెలిపారు. 

పూంచ్ జిల్లా సురాన్‌కోట్ అటవీ ప్రాంతంలో, రాజౌరీ జిల్లా తనమండి అటవీ ప్రాంతంలో అక్టోబర్ 11న ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. ఉగ్రవాదుల ఆచూకీ కోసం కోట్ భల్వాల్ సెంట్రల్ జైలులో ఉన్న పాక్ ఉగ్రవాది ఒకరిని ఆపరేషన్ జరుగుతున్న ప్రాంతానికి తీసుకెళ్లగా, అక్టోబర్ 24న అడవిలో నక్కి ఉన్న ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అతడు మృతి చెందాడు.

ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే ఉగ్రవాదులు ఎదురుపడ్డారు. అక్టోబర్ 11న సురాన్‌కోట్‌లో, 14న భట్టీదురియన్‌లో ఎదురుపడ్డారు. ఈ రెండు ఘటనల్లో వరుసగా ఐదుగురు, నలుగురు చొప్పున సైనికులు మృతి చెందారు. ఈ ఆపరేషన్‌లో ఒక ఎకె రకం రైఫిల్, కొంత మందుగుండు, ఇతర సామగ్రిని సైన్యం జప్తు చేసింది.

దట్టమైన అడవిలో ఉగ్రవాదులను కనిపెట్టడం క్లిష్టంగా ఉన్నదని ఓ అధికారి తెలిపారు. ఉగ్రవాదుల కోసం అడవి మొత్తం జల్లెడ పడుతున్నామన్నారు. ఉగ్రవాదులకు సహకరిస్తున్నారన్న అనుమానంతో ఆ ప్రాంతంలోని దాదాపు 12 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఆపరేషన్ జరుగుతున్న ప్రాంతంలో పౌరుల రాకపోకలను నిలిపివేశారు.

కాగా, జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఎల్‌ఓసీకి సమీపంలో మందుపాతర పేలి ఇద్దరు భారత జవాన్లు వీరమరణం పొందారు. వీరిలో ఒక ఆఫీసరు కూడా ఉన్నారు. మరో ముగ్గురు గాయపడ్డారు. రాజౌరి జిల్లా నౌషెరా తహసిల్‌లోని ఎల్‌ఓసీ కలాల్ ప్రాంతంలో రోజువారీ గస్తీ తిరుగుతుండగా శనివారంనాడు మందుపాతర పేలినట్టు అధికారులు తెలిపారు. 

గాయపడిన జవాన్లను ఆర్మీ ఆసుపత్రికి తరలించగా, ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. చొరబాటు యత్నాలను తిప్పికొట్టేందుకు ఆర్మీ ఈ ప్రాంతంలో మందుపాతర ఏర్పాటు చేసిట్టు అధికారులను ఉటంకిస్తూ ఒక వార్తా సంస్థ తెలిపింది.