ద్వైపాక్షిక సంబంధాలపై చైనా `సరిహద్దు చట్టం’ ప్రభావం  

చైనా తాజాగా ఆమోదించిన  `సరిహద్దు భూమి చట్టం’ చైనా – భారత్  ద్వైపాక్షిక సంబంధాలపైనా,  సరిహద్దు నిర్వహణకు సంబంధించిన ప్రస్తుత ద్వైపాక్షిక ఒప్పందాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంటూ భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. 

ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం అపరిష్కృతంగా ఉండటం భారత్‌కు ఆందోళనకరమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి విడుదల చేసిన ప్రకటనలో, ఇటువంటి ఏక పక్ష చర్యల ప్రభావం ఇప్పటికే ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలపై ఉండబోదని తేల్చి చెప్పారు.

 “అలాంటి ఏకపక్ష ఏర్పాట్లు ఇరుపక్షాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం విలువ లేనిదే. అది సరిహద్దు విషయమే కావొచ్చు, భారత-చైనా సరిహద్దులో వాస్తవాధీన రేఖ వద్ద శాంతి, సామరస్యాల విషయమే కావొచ్చు” అని ఆ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఆ చట్టం సాకుతో చైనా ఏ చర్యకైనా పాల్పడవచ్చని, అయితే అది ఏకపక్షమే కాగలదని ఆయన  స్పష్టం చేశారు. 

ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదంపైన అయినా, సరిహద్దు ప్రాంతాల్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ప్రశాంతత, శాంతి, సామరస్యాల నిర్వహణపైన అయినా ఈ కొత్త చట్టం ప్రభావం ఉండబోదని వివరించారు. సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిని ఏకపక్షంగా మార్చగలిగే ఏదైనా చర్యను ఈ కొత్త చట్టం సాకుతో చేపట్టడం చైనా మానుకుంటుందని భారత్ ఆశిస్తోందని చెప్పారు. 

భారత దేశం దృష్టిలో 1963 నాటి చైనా-పాకిస్థాన్ సరిహద్దు ఒప్పందం అని చెప్పుకుంటున్న ఒప్పందానికి ఈ కొత్త చట్టం ఎటువంటి చట్టబద్ధతను కల్పించదని స్పష్టం చేశారు.  1963 నాటి ఒప్పందం చట్టవిరుద్ధమని, చెల్లనిదని భారత దేశం నిరంతరం చెప్తోందని ఆయన గుర్తు చేశారు. 

చైనా కొత్త చట్టం ప్రకారం, భూమి సరిహద్దు వ్యవహారాలపై ఇతర దేశాలతో సంయుక్తంగా కుదుర్చుకున్న, పూర్తయిన ఒప్పందాలకు చైనా కట్టుబడి ఉంటుంది. సరిహద్దు ప్రాంతాల్లో జిల్లాలను పునర్వ్యవస్థీకరించేందుకు చైనా ప్రభుత్వానికి అవకాశం ఉంది.