పెగాసస్‌ వ్యవహారంపై నిపుణుల కమిటీ

దేశంలో తీవ్ర దుమారం రేపిన పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది. పెగాసస్‌ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. 

ముగ్గురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్‌ ఆర్వీ రవీంద్రన్‌ నేతృత్వం వహిస్తారని, అలోక్‌ జోషి, సందీప్‌ ఒబెరాయ్‌ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపింది. కమిటీ పనితీరును పర్యవేక్షిస్తామని వెల్లడించింది.

గోప్యత హక్కును కాపాడుకోవడం ముఖ్యమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై స్పష్టతనివ్వాలని కేంద్రానికి అవకాశం ఇచ్చినా వినియోగించుకోకపోవడంతో… తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. 

పెగాసస్‌ వ్యవహారంలో గోప్యత హక్కు ఉల్లంఘన జరిగిందా లేదా అనేది కమిటీ పరిశీలిస్తుందని తెలిపింది. పౌరులపై నిఘాలో విదేశీ ఏజెన్సీల ప్రమేయంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుందని వ్యాఖ్యానించింది. 

ఆరోపణలపై క్షుణ్ణంగా పరిశీలించి ఎనిమిది వారాల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. కాగా, కమిటీ ఏర్పాటు చేస్తామన్న కేంద్రం ప్రతిపాదనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. జాతీయ భద్రత పేరుతో బాధ్యతల నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.

పౌరులపై నిఘా విషయంలో విదేశీ ఏజెన్సీల ప్రమేయం ఉన్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. మొదట వార్త పత్రికకలలో వచ్చిన కథనాల ఆధారంగా వేసిన పిటిషన్లతో సంతృప్తి చెందలేదని తెలిపింది. కానీ తర్వాత కొందరు ప్రత్యక్ష బాధితులు కూడా పిటిషన్ వేసినట్లు తెలిపింది. ప్రస్తుతం సమాచార యుగంలో ఉన్నామన్న సుప్రీంకోర్టు సాంకేతికత ప్రాధాన్యతను గుర్తించాలని తెలిపింది. 

కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయిల్ కు చెందిన పెగాసస్ స్పైవేర్ సాయంతో ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరపాలని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా, సుప్రీంకోర్టు న్యాయవాది ఎం ఎల్ శర్మ, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సహా  పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.