పరువు నష్టం కేసులో విచారణ ఎదుర్కొంటున్న కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని తమ ముందు హాజరు కవాల్సిందిగా గుజరాత్లోని సూరత్ జిల్లా కోర్టు ఆదేశించింది. ‘మోదీ ఇంటి పేరు’ పై చేసిన వ్యాఖ్యలకు గాను రాహుల్పై పరువునష్టం కేసు నమోదైంది.
అయితే ఈ కేసులో ఈ ఏడాది జూన్ 24న కోర్టు ముందు రాహుల్ హాజరయ్యారు. అంతే కాకుండా తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్లు కూడా ఆయన గతంలో పేర్కొన్నారు. అయితే తాజాగా ఇద్దరు సాక్షులను విచారించిన కోర్టు.. రాహుల్ని అక్టోబర్ 29న తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేయడం విశేషం.
కొత్తగా ఇద్దరు సాక్షుల వాంగ్మూలం తీసుకున్నందున, మరోసారి వాంగ్మూలం ఇచ్చేందుకు అక్టోబర్ 29న కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా చీఫ్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ ఏ.ఎన్. దావే ఆదేశించారు.
అక్టోబర్ 29న మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటలలోపు రాహుల్ గాంధీ సూరత్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాది కిరీట్ పన్వాలా తెలిపారు. 2019లో నిర్వహించిన ఓ ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘‘దొంగలందరికీ మోదీ అనే పేరు ఎందుకు ఉంది?’’ అని వ్యాఖ్యానించారు.
గుజరాత్కు చెందిన ఎమ్మెల్యే పర్నేష్ మోదీ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 499, సెక్షన్ 500 ప్రకారం కేసు నమోదు చేశారు. ఆయన యావత్ మోదీ సముదాయాన్నే కించపరిచే వ్యాఖ్యచేశారని పేర్కొన్నారు. చాలా మందికి వర్తించే మోదీ సముదాయం పేరును ఎలా కించపరుస్తారని ఆయన ప్రశ్నించారు. ఏప్రిట్ 2019లో నమోదైన ఈ కేసుపై సూరత్ మెజిస్ట్రేట్ విచారణ చేపట్టింది. అప్పటి నుంచి విచారణ కొనసాగుతూ వస్తోంది.
More Stories
ఇందిరా ఆస్తి పోవద్దనే వారసత్వపు పన్ను రద్దు
అమేథిలో రాహుల్, రాయ్బరేలీలో ప్రియాంక పోటీ?
మోదీ, రాహుల్ ప్రసంగాలపై ఈసీ నోటీసులు