తెలంగాణ నుండి విజయవాడకు మరో జాతీయ రహదారి

తెలంగాణ  నుంచి విజయవాడ వెళ్లాలంటే హైవే నంబర్ 65 ఒక్కటే ప్రస్తుతమున్న ప్రధాన మార్గం. ఈ నేపథ్యంలో ఎల్‌బినగర్‌తో పాటు దానిచుట్టుపక్కల ప్రాంతాలపై తీవ్ర ఒత్తిడి పెరిగిపోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే తెలంగాణ నుండి  విజయవాడ మధ్య మరో కొత్త జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
 
నాలుగు వరుసలు ఉండే ఈ జాతీయ రహదారి తెలంగాణ పరిధిలో 310 కిలోమీటర్ల మేర నిర్మితం కానుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ భారత్‌మాల పరియోజన పథకానికి కేంద్రం రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కొన్ని ప్రాంతాల్లో ఉన్న జాతీయ రహదారులను అనుసంధానిస్తుండగా, మరికొన్ని చోట్ల కొత్త రోడ్లను కేంద్రం నిర్మిస్తోంది. 
అందులో భాగంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మీదుగా రూపుదిద్దుకుంటున్న జాతీయ రహదారికి కొనసాగింపుగా మంచిర్యాల నుంచి ఈ కొత్త రోడ్డు మొదలై విజయవాడ వరకు కొనసాగుతుంది. పాత రోడ్లతో సంబంధం లేకుండా పూర్తి కొత్తగా ఈ హైవేని నిర్మించనున్నట్టు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు. నాలుగు వరుసలు ఉండే ఈ జాతీయ రహదారి తెలంగాణ పరిధిలో 310 కిలోమీటర్ల మేర నిర్మితం కానుంది.
నాగ్‌పూర్ నుండి విజయవాడ కారిడార్‌లో భాగంగా మంచిర్యాల- టు విజయవాడ మధ్య కొత్త జాతీయ రహదారికి ముసాయిదా నోటిఫికేషన్ సైతం జారీ చేశారు. వరంగల్ నుంచి ఖమ్మం మీదుగా విజయవాడకు ప్రధాన రైల్వే లైన్ ఉండగా అది సౌకర్యవంతమైన రహదారి కాదనీ, ఈ నేపథ్యంలో పాతరోడ్లను వదిలేసి పూర్తిగా కొత్తరోడ్డును నిర్మించాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్ణయించింది.

ఈ క్రమంలో ఉత్తర భారతంలో ప్రారంభమయ్యే ఈ సరికొత్త హైవే నాగ్‌పూర్ మీదుగా తెలంగాణలోని మంచిర్యాల నుండి  వరంగల్, ఖమ్మం, విజయవాడల  మీదుగా దక్షిణ భారతంలోని దిగువభాగానికి చేరుతుంది. మాములుగా రైల్‌లో విజయవాడకు వెళ్లాలనుకుంటే నల్లగొండ, వరంగల్, ఖమ్మంల మీదుగా విజయవాడకు వెళ్లాల్సి ఉంటుంది. అలా ఈ జాతీయ రహదారికి రూపకల్పన చేసినట్టుగా తెలిసింది.

మంచిర్యాలకు ముందు కొన్నిచోట్ల పాత జాతీయ రహదారిని అనుసంధానిస్తూ మిగతా చోట్ల కొత్త రోడ్డును నిర్మిస్తున్నారు. మంచిర్యాల నుంచి పూర్తిగా కొత్త రోడ్డు అయినందున ఏకంగా 1,450 హెక్టార్ల భూమిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతరత్రా ప్రక్రియలకు ఆరు నెలలు పడుతుందని, ఆ తర్వాత పనులు ప్రారంభించి 24 నెలల్లో పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 

అన్ని పనులు సక్రమంగా జరిగితే 2023 చివరి నాటికి ఈ జాతీయ రహదారి వాహనదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణ జిల్లాల నుంచి విజయవాడకు రోడ్డు మార్గాన వెళ్లాలంటే ఎక్కువ మంది హైదరాబాద్ మీదుగానే ప్రయాణిస్తుంటారు. దీంతో హైదరాబాద్ నుండి విజయవాడ హైవేపై నిత్యం ట్రాఫిక్ రద్దీ నెలకొంటోంది.

ప్రత్యామ్నాయంగా మెరుగైన మరో మార్గం లేకపోవటంతో దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి ప్రయాణ సమయం పెరుగుతోంది. కొత్త హైవే అందుబాటులోకి వస్తే చాలా ప్రాంతాల వారు హైదరాబాద్‌కు రాకుండా వరంగల్, ఖమ్మం మీదుగా విజయవాడ చేరుకునే సౌలభ్యం రానుంది.