100 కోట్ల టీకాలు `నూతన భారత్’ ఇమేజ్ కు నిదర్శనం 

100 కోట్ల టీకా మైలురాయిని సాధించినందుకు భారతీయులను అభినందిస్తూ ఈ ఘన విజయం `నూతన భారత్’ ఇమేజ్ కు నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.  సంపూర్ణంగా శాస్త్రీయ  ప‌ద్ధ‌తుల్లో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం జ‌రిగిన‌ట్లు ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో130 కోట్ల మంది భారతీయులు, శాస్త్రవేత్తలు, ఆరోగ్య కార్యకర్తల కృషి తర్వాత ఈ మైలురాయిని సాధించామని మోదీ చెప్పారు.

ఈ ఘ‌న‌త దేశంలోని ప్ర‌తి ఒక పౌరుడికి చెందుతుంద‌ని తెలుపుతూ ఈ మార్క్‌ను అందుకున్న నేప‌థ్యంలో ప్ర‌తి పౌరుడికి అభినందనలు తెలిపారు. వంద కోట్ల వ్యాక్సిన్ డోసులు కేవ‌లం సంఖ్య మాత్ర‌మే కాదని, దేశ చ‌రిత్ర‌లో ఇదో కొత్త అధ్యాయం అని ప్రధాని పేర్కొన్నారు. క‌ఠిన ప‌రిస్థితుల్లో భారత్  ఓ ల‌క్ష్యాన్ని విజ‌య‌వంతంగా చేరుకున్న‌ట్లు చెప్పారు.

కొవిడ్-19 టీకా కార్యక్రమంలో వీఐపీ క‌ల్చ‌ర్ ప్ర‌భావం ప‌డ‌కుండా ఉండేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని పేర్కొంటూ ప్ర‌తి ఒక్క‌ర్నీ స‌మంగా చూశామ‌ని ప్రధాని తెలిపారు. ల‌క్ష్యాల కోసం దేశం క‌ఠినంగా ప‌నిచేస్తుంద‌న్న సంకేతాన్ని చెబుతుంద‌ని అంటూ ఇది భార‌త సామ‌ర్ధ్యానికి ప్ర‌తిబింబంగా నిలుస్తుంద‌ని ప్రధాని కొనియాడారు.

‘‘ఈ రోజు చాలా మంది ప్రజలు భారతదేశ కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చి చూస్తున్నారు.భారతదేశం 100 కోట్ల కరోనా టీకా మార్కును దాటిన వేగం  ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించారు” అని ప్రధాని పేర్కొన్నారు. 

కరోనా మహమ్మారి ప్రారంభంలో, భారతదేశం వంటి ప్రజాస్వామ్యంలో ఈ మహమ్మారిపై పోరాడటం చాలా కష్టమనే భయాలు వ్యక్తమయ్యాయని గుర్తు చేశారు. వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంపై మొద‌ట్లో చాలా భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం అయ్యాయ‌ని, భారత్  లాంటి దేశంలో వ్యాక్సిన్ క్ర‌మ‌శిక్ష‌ణ ఎలా సాధ్యం అవుతుంద‌ని విమ‌ర్శించార‌ని పేర్కొన్నారు. 

స‌బ్‌కా సాత్‌.. స‌బ్ కా వికాశ్‌కు ఇండియా వ్యాక్సిన్ ప్రోగ్రామ్ స‌జీవ ఉదాహ‌ర‌ణ అని ప్రధాని చెప్పారు. ఇంత సంయమనం, అంత క్రమశిక్షణ ఇక్కడ ఎలా పని చేస్తాయనేది ఈ టీకా కార్యక్రమం ద్వారా భారతదేశ ప్రజలకు కూడా చెప్పామని మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు.

‘‘దేశం ‘అందరికీ టీకా’  నగదు రహిత వ్యాక్సిన్ అనే ప్రచారాన్ని ప్రారంభించాం.వాక్సిన్ పంపిణీలో పేద-ధనిక, గ్రామం-నగరం, సుదూర అనే తేడా లేకుండా దేశంలో ఒకే ఒక మంత్రం ఉంది. టీకాల పంపిణీలో ఎలాంటి వివక్ష ఉండదు’’అని మోదీ స్పష్టం చేశారు.

నేడు భారతీయ కంపెనీలలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం మాత్రమే కాదు, యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కూడా సృష్టించామని, స్టార్టప్‌లలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని ప్రధాని పేర్కొన్నారు. భారతదేశంలో తయారైన వస్తువులను కొనడం, స్థానికంగా భారతీయులు తయారు చేసిన వస్తువులను కొనడాన్ని ఆచరణలో పెట్టాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.

‘‘మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా భారతీయుడు చెమటోడ్చి తయారుచేసిన చిన్న వస్తువును కొనుగోలు చేయాలని  నేను దేశ ప్రజలను కోరుతున్నాను. ఇది అందరి ప్రయత్నాలతో మాత్రమే సాధ్యమవుతుంది.’’ అని మోదీ వివరించారు.