మావోయిస్టు అగ్రనేత హిడ్మా కోసం ముమ్మరంగా గాలింపు

మావోయిస్టు పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) ఒకటో బెటాలియన్‌ కమాండర్‌ మాడ్వీ హిడ్మా ఏటూరునాగారం అడవుల్లో ప్రవేశించారనే సమాచారంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న హిడ్మాను పట్టుకునేందుకు కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల పోలీసులు ముప్పేట దాడికి సిద్ధమయ్యారు.

ఛత్తీస్‌గఢ్‌ లోని అటవీ ప్రాంతాల్లో తలదాచుకుంటున్న మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ–1 కమాండర్‌ హిడ్మాకు కరోనా సోకడంతో చికిత్స కోసం ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతాల్లోకి వచ్చినట్లు సమాచారం. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వెంకటాపురం, వాజేడు అడవుల్లో చికిత్స పొందుతున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి పోలీసులకు సమాచారం అందింది.

హిడ్మా ఏజెన్సీలోని అడవుల్లో, గొత్తికోయగూడేల్లో తలదాచుకొని చికి త్స పొందుతున్నారనే కోణంలో ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. స్పెషల్‌ పార్టీ పోలీసులతోపాటు గ్రేహౌండ్స్‌ బలగాలు అడుగడుగునా తనిఖీలు చేస్తున్నాయి. హిడ్మా ఆచూకీ కోసం జాగిలాలు, డ్రోన్‌ కెమెరాలను రంగంలోకి దింపాయి.

ఇటీవల అగ్రనేత ఆర్కేను కోల్పోయిన మావోయిస్టు పార్టీకి ఇప్పుడు హిడ్మా అనారోగ్య సమస్య మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో చికిత్స అందకనే తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాలకు వచ్చి ఉంటాడని నిఘా వర్గాలు తెలిపాయి.

ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఇంద్రావతినది పరీవాహక ప్రాంతం మీదగా భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోకి మావోయిస్టు బృందాలు ప్రవేశించాయనే ప్రచారం జరుగుతోంది. పలిమెల, మహాదేవపూర్‌, మహాముత్తారంతోపాటు.. ములుగు జిల్లా కన్నాయిగూడెం, తాడ్వాయి, ఏటూరునాగారం, గోవిందరావుపే ట అడవుల్లో హిడ్మా తలదాచుకునే అవకాశాలున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

పీఎల్‌జీఏ నేత కావడంతో హిడ్మాకు నాలుగంచెల భద్రత ఉం టుంది. అంటే.. కనీసం పాతిక మంది సాయుధులైన మావోయిస్టులు అతనికి కాపలాగా ఉంటారు. మరోవైపు హిడ్మా తన బృందంతో భూపాలపల్లి, ములుగు జిల్లా సమీపంలో గోదావరితీరం దాటి ఉండొచ్చనే అనుమానాలు పోలీసువర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. 

మహదేవపూర్‌-ఏటూరునాగారం ఏరియా కమిటీ హిడ్మాకు ఆశ్రయం ఇచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లోని అడవి ప్రాంత ఆర్‌ఎంపీలు, పీహెచ్‌సీలు, ప్రైవేటు ఆస్పత్రులపై నిఘా పెంచారు.  ఛత్తీస్‌గఢ్‌    సరిహద్దుల్లోనూ కూంబింగ్‌ కొనసాగిస్తున్నారు.

మరోవంక, మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్‌గా దళంలోని కొందరు వ్యక్తులు స్లోపాయిజన్‌ ప్రయోగం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే కూడా కొవిడ్‌ నుంచి కోలుకున్నా.. తదనంతర లక్షణాలతోపాటు, తీవ్రమైన అనారోగ్యం బారిన పడ్డారని తెలుస్తోంది. 

విషప్రయోగం మెల్లిమెల్లిగా శరీర భాగాలపై ప్రభావం చూపించిందని, ఊపిరితిత్తుల, మూత్రపిండాల సమస్యలకు అదే కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నింటికీ మించి, ఉన్నఫళంగా నరాల బలహీనత సమస్య ఆర్కేను తీవ్రంగా వేధించిందని సమాచారం. హిడ్మాలో కూడా క్రమంగా ఇలాంటి లక్షణాలే బయటపడుతున్నాయని, నరాల సమస్య ప్రారంభమవ్వడంతో.. విషప్రయోగంపై అప్రమత్తమై చికిత్సకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.