జ‌మ్మూక‌శ్మీర్‌లో పేలుళ్ల‌కు ఐఎస్ఐ కుట్ర‌!

పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ.. ప‌లు ఉగ్ర‌వాద సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో పీవోకేలోని ముజ‌ఫ‌రాబాద్‌లో ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 21వ తేదీన ఓ స‌మావేశం ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది. జ‌మ్మూక‌శ్మీర్‌లో భారీ స్థాయిలో దాడులు చేయాల‌ని ఆ స‌మావేశంలో నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.

క‌శ్మీర్‌లో ప‌ని చేసే పోలీసులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, నిఘా వ‌ర్గాల‌తో పాటు క‌శ్మీరి పండిట్లు టార్గెట్‌గా దాడుల‌కు రూప‌క‌ల్ప‌న చేసిన‌ట్లు స‌మాచారం. అంతే కాకుండా నాన్ క‌శ్మీరీ ప్ర‌జ‌లతో పాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు అనుబంధంగా ఉండే వారిని టార్గెట్ చేసిన‌ట్లు నిఘా వ‌ర్గాలు ప‌సిగ‌ట్టాయి.

ఇక కాశ్మీర్ లోయలో  సుమారు 200 మంది హిట్‌లిస్ట్ త‌యారు చేసిన ఐఎస్ఐ.. వారిని అంత‌మొందించి ఉద్రిక్త వాతావ‌ర‌ణం సృష్టించేందుకు ప్ర‌ణాళిక‌లు త‌యారు చేసిన‌ట్టు స‌మాచారం. ఈ 200 మందిలో భార‌త ప్ర‌భుత్వానికి స‌న్నిహితంగా ఉంటున్న మీడియా ప్ర‌తినిధులు, ఇండియ‌న్ ఏజెన్సీల ఇన్‌ఫార్మ‌ర్లు, భ‌ద్ర‌తా ద‌ళాల అధికారుల‌తో పాటు క‌శ్మీరీ పండిట్లు ఉన్న‌ట్లు తెలిసింది.

అయితే ఈ ఉగ్ర‌దాడుల‌కు భారత భద్రతా దళాల జాబితాలోని ఉగ్ర‌వాద సంస్థ‌ల‌ను ఉప‌యోగించాల‌ని ఐఎస్ఐ, ప్ర‌స్తుత‌మున్న ఉగ్ర‌వాద సంస్థ‌లు అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. మొత్తంగా ఉగ్ర‌వాద సానుభూతిప‌రుల‌తోనే దాడులు చేయించాల‌ని ప్లాన్ చేసిన‌ట్లు తెలిసింది. ఇక ఆయుధాల‌ను ఉరి, తంగ‌ధ‌ర్ క్యాంపుల నుంచి నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి స్మ‌గ్లింగ్ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది.

సైనిక అధికారి, సైనికుడు వీరమరణం 

మరోవంక, జ‌మ్మూక‌శ్మీర్ ఫూంచ్ జిల్లాలో గురువారం జ‌రిగిన కౌంట‌ర్ టెర్ర‌ర్ ఆప‌రేష‌న్ చ‌ర్య‌ల్లో భాగంగా, భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఆర్మీ అధికారితో పాటు ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయారు.

గ‌త నాలుగు రోజుల క్రితం ఉగ్ర‌వాదులు జ‌రిపిన కాల్పుల్లో ఐదుగురు సైనికులు వీర‌మ‌ర‌ణం పొందిన విష‌యం తెలిసిందే. నాటి నుంచి ఆ ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టేందుకు బ‌ల‌గాలు కూంబింగ్ కొన‌సాగిస్తున్నాయి. ఈ క్ర‌మంలో బుధ‌వారం సాయంత్రం ఫూంచ్ – రాజౌరీ ర‌హ‌దారిని మూసేశారు. ఆ మార్గంలో ఉన్న ద‌ట్ట‌మైన అడ‌వుల్లో ఉగ్ర‌వాదులు త‌ల‌దాచుకున్నారు.