కశ్మీర్ లో ఐదుగురు ఉగ్రవాదుల హతం 

ఐదుగురు జవాన్లను పొట్టనపెట్టుకున్న 24 గంటల లోగా జమ్మూ కాశ్మీర్ లో భద్రతా దళాలు ఐదుగురు ఉగ్రవాదులను హతం చేశాయి. కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఇటీవలే ఓ స్కూల్లో చొరబడి ప్రిన్సిపాల్‌, టీచర్‌ను హత్య చేసిన ద రెసిస్టాన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌) కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. వారితో పాటు మరో ఇద్దరు ముష్కరులను కూడా మట్టుబెట్టాయి. 

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఐదుగురు ఉగ్రవాదులను బలగాలు ఖతం చేశాయి. జిల్లాలోని తల్రాన్‌ ప్రాంతంలో ఓ భవనంలో ముష్కరులు దాక్కొన్నట్లు సమాచారం అందడంతో బలగాలు సోమవారం రాత్రి గాలింపు ప్రారంభించాయి. లొంగిపోవాలని బలగాలు ఎంతగా విజ్ఞప్తి చేసినా ఫలితం రాలేదు. దీంతో బలగాలు ఆ భవనాన్ని పేల్చివేశాయి. 

ఈ ఘటనలో టీఆర్‌ఎ్‌ఫకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. వారిని ఇద్దరిని కశ్మీర్‌లోని గాందర్బాల్‌కు చెందిన ముఖ్తార్‌ షా, కుల్గాం జిల్లాకు చెందిన బాసిత్‌ అహ్మద్‌దార్‌ (25) గా గుర్తించారు. ఈ ఇద్దరూ మరో ఇద్దరితో కలిసి శ్రీనగర్‌లో ఇటీవలే వివిధ పౌరులను హత్య చేశారు. 

ఈనెల 5న మఖన్‌లాల్‌ బింద్రూ, బిహార్‌కు చెందిన పానీపూరి వ్యాపారి వీరేంద్ర పాసవాన్‌ను చంపారు. ఈనెల 7న శ్రీనగర్‌లోని ఓ స్కూల్లో చొరబడి ప్రిన్సిపాల్‌ సుపీందర్‌ కౌర్‌, ఉపాధ్యాయుడు దీపక్‌ చంద్‌ను కూడా ఆ ముష్కరులు కాల్చి చంపారని కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. షోపియాన్‌ జిల్లాలోనే ఫేరిపొరా ప్రాంతంలో మరో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. మృతులను గుర్తించాల్సి ఉందని అధికారులు చెప్పారు. 

ఢిల్లీలో పాక్ ఉగ్రవాది అరెస్ట్ 

కాగా ఢిల్లీలోని లక్ష్మీనగర్‌లో ఓ పాకిస్థాన్‌ ఉగ్రవాదిని పోలీసులు అరెస్టుచేసి భారీ ఉగ్ర కుట్రను భగ్నంచేశారు. అతడిని పాక్‌లోని పంజాబ్‌కు చెందిన మొహమ్మద్‌ అష్రఫ్‌ (40)గా గుర్తించారు. అతడు  భార‌త జాతీయుడిగా నకిలీ గుర్తింపు కార్డుతో  ల‌క్ష్మీన‌గ‌ర్‌లోని ర‌మేష్ పార్క్ ప్రాంతంలో ఉంటున్నాడు.

మ‌హ్మ‌ద్ అష్ర‌ఫ్ పై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీస్ స్పెష‌ల్ సెల్ అధికారులు మంగళవారం ఆ ప్రాంతంలో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో అష్రఫ్ ను అరెస్టు చేసి, అతడి నుంచి పోలీసులు ఏకే-47తోపాటు  మ్యాగ‌జైన్‌, 60 రౌండ్ల బుల్లెట్లు, ఒక హ్యాండ్ గ్రెనేడ్‌, రెండు పిస్ట‌ళ్లను స్వాధీనం చేసుకున్నారు. 

అతడికి పాక్‌ గూఢచార సంస్థ ఐఎ్‌సఐతో సంబంధాలు ఉన్నాయని, ఢిల్లీలో భారీ ఉగ్రదాడికి ఉగ్రవాదులు పన్నిన కుట్రలో అతడికీ భాగస్వామ్యం ఉందని పోలీసులు తెలిపారు. ‘‘13 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్‌ మీదుగా అతడు భారత్‌లోకి చొరబడ్డాడు. ఫోర్జరీ ద్వారా ధ్రువపత్రాలు సంపాదించి, అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాడు. కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. అతడిని 14 రోజుల కస్టడీలోకి తీసుకున్నాం’’ అని పోలీసులు చెప్పారు.

దసరా సీజన్ కావడంతో ఢిల్లీలోని అన్ని మార్కెట్లలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అపరిచితులు, అనుమానితులు కనిపిస్తే, తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ఢిల్లీ ప్రజలను కోరుతున్నారు.

మణిపూర్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు హతం 

మరోవంక, మణిపూర్‌లో ఉగ్రవాదులు పౌరులపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో గ్రామ పెద్ద సహా ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. రాష్ట్రంలోని కాంగ్‌పోక్సి జిలల్లా బీ గమ్మోమ్‌ ప్రాంతంలో కుకీ మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఎంపీ ఖుల్లెన్‌ గ్రామ పెద్ద, మరో నలుగులు మరణించారు. మృతుల్లో ఓ మైనర్‌ బాలుడు కూడా ఉన్నాడు. ఇప్పటివరకు మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మిలిటెంట్ల కోసం విస్తృతంగా గాలిస్తున్నామని చెప్పారు.

గత ఆదివారం భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో నలుగురు కుకీ ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఇద్దరు ఉగ్రవాదుల అంత్యక్రియలను గ్రామస్థులు నిర్వహిస్తుండగా మిలిటెంట్లు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారని స్థానికులు వెల్లడించారు.