తాలిబన్ల చెరలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో జర్నలిస్టుల పరిస్థితి మరింత దుర్భరంగా మారుతున్నది. మీడియాపై తాలిబన్ల ఆంక్షలు తీవ్రతరమవడంతో ఇప్పటికే పలు సంస్థలు మూతపడ్డాయి. పలువురు జర్నలిస్టులు దేశాన్ని విడిచి పారిపోయారు. ఒక వార్తపై రిపోర్ట్ చేసినప్పటికీ.. తాలిబన్లకు నచ్చితేనే వార్త వెలుగులోకి వచ్చే పరిస్థితి నెలకొంది.
తాలిబాన్లకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించిన వారిపై దాడులకు తెగబడుతున్నారు.రిపోర్టింగ్ చేయడానికి వీలులేని విధంగా తాలిబన్ల నిబంధనలు ఉన్నాయని మానవ హక్కుల సంఘం హ్యూమన్ రైట్స్ వాచ్ (హెచ్ఆర్డబ్ల్యు) ఇటీవల ప్రకటించింది. తాలిబన్లకు సంబంధించిన సమాచారంపైనే కాకుండా ఇతర కేసుల్లో కూడా ఏకపక్ష నిర్బంధాలు, హింస కొనసాగుతున్నాయని వివరించింది.
ఇప్పటివరకు తాలిబన్లు తన విధుల్లో జోక్యం చేసుకోలేదని కాని వారు ఏ వివరాలను మీడియాకు తెలపడం లేదని, దీంతో తమ పని కష్టతరమౌతుందని తూర్పు ఆఫ్ఘన్ ప్రావిన్స్లోని నంగర్హార్కి చెందిన జర్నలిస్ట్ ఒకరు తెలిపారు. తాలిబన్లకు వ్యతిరేకంగా, వారికి నచ్చని విధంగా వార్తలను రిపోర్ట్ చేయకూడదని నిబంధనల్లో సూచించారని… ఇవి తమకు ఇబ్బందికరంగా మరాయని మరో జర్నలిస్ట్ పేర్కొన్నారు.
తాను విదేశీ జర్నలిస్టులతో కలిసి పనిచేస్తున్నానని, దీంతో జిహాదీలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నానంటూ తాలిబన్లు తన నివాసానికి వచ్చి తన తండ్రిని బెదిరించారని కునార్ ప్రావిన్స్కు చెందిన ఒక జర్నలిస్ట్ తెలిపారు. దీంతో తన కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురవుతున్నారని, తనని జర్నలిస్ట్ వృత్తి మానేయాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారనిపేర్కొన్నారు.
మహిళా జర్నలిస్టులు కెమెరా ముందుకు రాకూడదని ఆంక్షలు విధించారని బదాక్షన్కి చెందిన ఓ మహిళా జర్నలిస్ట్ తెలిపారు. రేడియో జర్నలిస్టులుగా విధులు నిర్వహించేందుకు అనుమతించినప్పటికీ, ఆ కార్యక్రమం పూర్తిగా మహిళలతోనే రూపొందించాలని ఆదేశించారని చెప్పారు. రేడియో స్టేషన్లోని సాంకేతిక సిబ్బంది మొత్తం పురుషులేనని, దీంతో పూర్తి కార్యక్రమం మహిళలే రూపొందించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. దీంతో తమను విధుల నుండి తొలగించారని తెలిపారు. తమ తప్పు లేకుండానే విధుల నుండి బయటికి రావలిసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బదాక్షన్లో పలు మీడియా సంస్థలు విదేశీ నిధులతో పనిచేస్తున్నాయని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో ఆ సంస్థలు మీడియాపై నిషేధం విధించాయని మరో జర్నలిస్ట్ తెలిపారు. ఆఫ్ఘన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత నుండి ఇప్పటివరకు 32 మంది జర్నలిస్టులపై తాత్కాలిక నిషేధం విధించిందని హెచ్ఆర్డబ్ల్యు పేర్కొంది.
కాబూల్కి చెందిన వార్తాపత్రికలోని ఇద్దరు జర్నలిస్టులపై దాడి చేసిందని, ఒకరు అపస్మారక స్థితిలోకి వెళ్లారని తెలిపింది. తాలిబన్ల ఆక్రమణకు ముందు ఆఫ్ఘన్లో అనేక సమస్యలు ఉన్నప్పటికీ.. ఇప్పుడు పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారిందనడంలో సందేహం లేదని హెచ్ఆర్డబ్ల్యు పేర్కొంది.
More Stories
వంతెన ప్రమాదంలో భారతీయుల చొరవకు బిడెన్ ప్రశంస
అసాంజెను అమెరికాకు తక్షణమే అప్పగించలేం
అమెరికాలో కుప్పకూలి నదిలో పడిపోయిన వంతెన