మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ సూచించారు. జెఎన్టియు హైదరాబాద్ స్వర్ణోత్సవాలను ఆమె ప్రారంభి, స్వర్ణోత్సవాల లోగోను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల కోసం ప్రత్యేక కేంద్రం నిర్మిస్తున్నట్లు తెలిపారు.
జెఎన్టియుకు దేశంలోనే మంచి పేరు ఉందని, తొలి సాంకేతిక విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిందని ఆమె కొనియాడారు. ప్రస్తుతం ప్రతి ఒక్కటి సాంకేతికపైనే ఆధారపడి ఉందని చెబుతూ అందుకు అనుగుణంగా విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆమె సూచించారు.
భారత్ నుంచి ఇతర దేశాలకు టీకాలు ఎగుమతి అవుతున్నాయంటే ఇలాంటి విశ్వవిద్యాలయాల నుంచి వెళ్లిన విద్యార్థుల కృషేనని గవర్నర్ కితాబిచ్చారు. ఈ విశ్వవిద్యాలయం పరిధిలో ఇప్పటి వరకూ 19 లక్షల మంది చదువుకున్నారని ఆమె గుర్తుచేశారు. పూర్వ విద్యార్థులు అంటే భావితరాల ఆస్తి అని పేర్కొంటూ వారిందరినీ ఏకం చేస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చని ఆమె పెక్రోన్నారు.
స్వర్ణోత్సవ వేడుకలు గవర్నర్ చేతుల మీదుగా జరగడం సంతోషంగా ఉందని వైస్ ఛాన్సలర్ కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విశ్వవిద్యాలయానికి గుర్తింపు సాధ్యమైందని ఆయన చెప్పారు. ఏడాది పాటు స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ 50 ఏళ్లలో ఎన్నో మైలురాళ్లు, ప్రత్యేకతలను ఈ విశ్వవిద్యాలయం సాధించిందని ఆయన గుర్తుచేశారు.
More Stories
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదు
ఈసీ ఒప్పుకున్నా పంట పరిహారంపై స్పందించని రేవంత్
తెలంగాణాలో 8,10 తేదీల్లో ప్రధాని ప్రచారం