భారత్ కు వ్యతిరేకంగా సరిహద్దుల్లో చైనా, పాక్ కుట్ర

ఒక వంక లడఖ్ సరిహద్దు వెంబటి చైనా తన సేనలను మోహరిస్తుండగా, మరోవంక భారత్ కు వ్యతిరేకంగా సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్ సైనికాధికారులు కుట్రపతున్నట్లు భారత్ నిఘా వెల్లడించాయి. భారత్ కు వ్యతిరేకంగా సహకరించడం కోసం చైనా సైన్యం  పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ)లో  పలువురు పాకిస్థాన్ సైనికాధికారులు చేరినట్లు తెలుస్తున్నది.  చైనా సైన్యంలో పాక్ సైనిక అధికారుల రహస్యంగా మోహరించినట్లు తెలుస్తున్నది.

భారత రక్షణ మంత్రిత్వ శాఖ, సైన్యం ఈ విషయాలపై నిశితంగా గమనిస్తున్నాయి.ఒక మీడియా నివేదిక ప్రకారం, పాకిస్తాన్ సైనిక అధికారులు చైనా సైన్యం పశ్చిమ, దక్షిణ కమాండ్‌లో నియమితులయ్యారు. పశ్చిమ కమాండ్ లడఖ్‌లో మోహరించగా, దక్షిణ కమాండ్ టిబెట్ ప్రాంతంలో ఉన్నది. 

పాకిస్తాన్ సైనిక అధికారులకు ఈ రెండు ప్రాంతాల కార్యాలయాల్లో పోస్టింగ్‌లు ఇచ్చినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.బీజింగ్‌లోని చైనా రాయబార కార్యాలయంలో దాదాపు 10 మంది పాకిస్థాన్ సైనిక అధికారులను కూడా నియమించినట్లు సమాచారం. వారికి వేరే పనులేవీ అప్పగించలేదని తెలుస్తున్నది. అయితే, చైనాలో ప్రస్తుతం ఎంతమంది పాక్ ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారనేది స్పష్టంగా తెలియదు.

“తూర్పు లడఖ్, ఉత్తర భాగంలో మన తూర్పు కమాండ్  వరకు చైనా గణనీయమైన సంఖ్యలో సేనలను మోహరించింది. ఖచ్చితంగా, ఫార్వర్డ్ ఏరియాలలో వారి విస్తరణలో పెరుగుదల ఉంది, ఇది మనకు ఆందోళన కలిగించే విషయం” అని ప్రస్తుతం లడఖ్ పర్యటనలో ఉన్న భారత్ సైన్యాధిపతి ఎం ఎం  నారావణే తెలిపారు.

“మేము వారి కదలికలన్నింటినీ క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నాము. మాకు లభించే ఇన్‌పుట్‌ల ఆధారంగా, మౌలిక సదుపాయాలతో పాటు ఏదైనా ముప్పును ఎదుర్కోవడానికి అవసరమైన దళాల పరంగా కూడా మేం మ్యాచింగ్ డెవలప్‌మెంట్‌లను నిర్వహిస్తున్నాం. ప్రస్తుతానికి, మేము ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము” అని ఆయన స్పష్టం చేశారు. 

ఒకవైపు సరిహద్దుల నుంచి దళాలను తొలగించడం గురించి మాట్లాడుతున్న చైనా.. మరొక వైపు లడఖ్‌లో సైనిక దళాల మోహరింపు, ఆయుధాల విస్తరణను పెంచుతున్న విషయాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి కూడా  ధ్రువీకరించారు. చైనా, పాకిస్తాన్ చేష్టలను భారత విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖ నిశితంగా గమనిస్తున్నది. ఎప్పుడు ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత ఆర్మీ ప్రకటించింది.